- రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఎందుకు ఉన్నాయి
- సీజింగ్ బియ్యం గోడౌన్కు ఎందుకు తరలించలేదు
- విచారణ జరిపి నివేదిక ఇస్తాం
- జిల్లా సివిల్సప్లై అధికారిణి రుక్మిణీదేవి
- ఆదాబ్ కథనానికి కదులుతున్న డొంక
కొత్తగూడెం : మున్సిపాల్టీ పరిధిలోని రామవరంలో ఉన్న 20వ రేషన్షాపుకు సంబందించి గత రెండు సంవత్సరాల క్రితం 120బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు ఆనాటి అధికారులు. ఈరేషన్షాపుకు రెండు దఫాలుగా రేషన్ కోటా కంటే అదనంగా సరఫరా చేశారు. ఆనాడు సీజ్ చేసిన అప్పటి అధికారులు పట్టుకున్న బియ్యాన్ని గోడౌన్కు తరలించకుండా వదిలేశారు. అయితే 20వ నెంబర్షాపును ఇక్కడి నుంచి తరలించడంతో సీజ్ చేసిన బియ్యం పందికొక్కుల పాలు కావడంతోపాటు వర్షానికి తడిసి దుర్వాసనను వెదజల్లుతుండటం, పేదల బియ్యం పక్కదారి పడుతుండటంపై పేదలబియ్యం పందికొక్కుల పాలు, పట్టుకున్న బియ్యం మూలుగుతున్న వైనం, 120బస్తాల బియ్యాన్ని గోడన్కు తరలించని వైనం అంటూ శుక్రవారం ఆదాబ్హైదరాబాద్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈకథనంతో సివిల్సప్లయ్ అధికారులు కదిలారు. రేషన్ బియ్యం నిల్వతోపాటు పాడైన విషయంపై జిల్లా సివిల్సప్లై అధికారిని రుక్మిణీదేవి, సివిల్ సప్లై డిటి శ్రీనివాస్రావులు విచారణ ప్రారంభించారు. నిల్వ ఉండటంతోపాటు పాడైన బియ్యాన్ని పరిశీలించారు.
రేషన్ డీలర్తో మాట్లాడారు. ఆనాడు సీజింగ్ విషయంపై వివరాలు అడిగి తెలుసుకోవడంతోపాటు ఆనాడు పట్టుకున్న బియ్యం తాలూకా వివరాలను పూర్తిస్థాయిలో వెలికి తీసి ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగు తుందని ఆదాబ్కు తెలిపారు. పూర్తిస్థాయిలో ఆనాడు నివేదికలు ఆధారంగా బియ్యం నిల్వలను తూకం వేసి పట్టుకున్న బియ్యం కంటే తక్కువ ఉంటే సదరు డీలరుతోపాటు ఆనాడు బాధ్యతలు తీసుకున్న వ్యక్తిపై కూడా చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అధికారులు చేసిన తప్పిదంపై కూడా అదనపు చర్యలు కోసం జిల్లా జాయింట్ కలెక్టర్తోపాటు ఆర్డీఓకు నివేదిక అందచేస్తామని పేర్కొన్నారు.