పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. దుబాయిని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్కు తిరిగొచ్చేందుకు షరీఫ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. నాలుగేండ్ల పాటు దుబాయ్లో గడిపిన నవాజ్ షరీఫ్.. అక్టోబర్ 21న చార్టెర్డ్ విమానంలో పాకిస్తాన్ చేరుకుంటారని పాక్కు చెందిన జియో న్యూస్ పేర్కొంది. షరీఫ్ ప్రయాణించే విమానం పేరు ఉమీద్ ఈ పాకిస్తాన్. ఈ విమానానికి 150 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నట్లు జియో న్యూస్ వెల్లడించింది. ఇప్పటికే విమానం టికెట్లు బుకింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. మూడు సార్లు పాక్ ప్రధానిగా సేవలందించిన నవాజ్ షరీఫ్.. వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేయనున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ తరపున ఆయన బరిలో దిగనున్నారు. అయితే దుబాయ్ నుంచి లాహోర్ చేరుకున్న అనంతరం షరీఫ్.. మినార్ ఈ పాకిస్తాన్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. నవాజ్ షరీఫ్ బుధవారం సౌదీ అరేబియా చేరుకోనున్నారు. వారం రోజుల పాటు సౌదీ అరేబియాలో షరీఫ్ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. తిరిగి అక్టోబర్ 18న దుబాయ్ చేరుకోనున్నారు. అక్టోబర్ 21న పాకిస్తాన్కు బయల్దేరనున్నారు.