ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్పై ఇజ్రాయెల్ క్రమంగా పైచేయి సాధిస్తోంది. వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలో తమ దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. ముఖ్యంగా గాజాపై వరుస దాడులతో విరుచుకుపడుతోంది. గాజాలోని హమాస్ మిలిటెంట్ల ప్రధాన స్థావరాలపై వరుసగా క్షిపణులు, బాంబులతో దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హమాస్ లక్ష్యాలపై పూర్తి స్థాయిలో దాడులు చేయనున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ తాజాగా ప్రకటించారు. ‘గాజా సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించాం. అంతిమంగా హమాస్ను ఇజ్రాయెల్ ఏరిపారేస్తుంది. హమాస్ సీనియర్ సభ్యులను అంతమొందించడమే మా లక్ష్యం. మిలిటెంట్ల నియంత్రణలోని గాజా సరిహద్దు ప్రాంతాలను మా ఆధీనంలోకి తీసుకున్నాం. గాజా ఇకపై మునుపటి స్థితిలోకి వెళ్లడం అసాధ్యం. ఇందుకు హమాస్ విచారించడం ఖాయం. గాజాలో హమాస్ మార్పును కోరుకుంటోంది. అది అనుకున్న స్థితి నుంచి 180 డిగ్రీలు మారుతుంది’ అని ఆయన అన్నారు.