- విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడకుండా అవగాహన కల్పించాలి
- జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
- పొలాల్లో గంజాయి పెంచకుండా వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలి : జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఐపిఎస్
- జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన అధికారులు
వికారాబాద్ : యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా గంజాయి ఇతర మత్తు పదార్థాల సరఫరా, జరగకుండా సంబంధిత అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వికారాబాద్, పరిగి,తాండూర్ ప్రాంతాల లో గంజాయి సంస్కృతి కనిపిస్తుందని, దీనికి యువత అలవాటు పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దీనిని మొగ్గలోనే తుం చేయాలని అన్నారు. మాదకద్రవ్యాల కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందన్నారు. మత్తు పదార్థాల కు ముఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్థులు ఆకర్షితులయ్యే అవకా శం ఉన్నందున, విద్యా సంస్థలలో డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి వారానికి ఒకసారి సమాసాలు నిర్వహించి విద్యార్థులకు దీనిపట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రతినెల జిల్లా స్థాయిలో కూడా సమావేశ నిర్వహించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. విద్యా సంస్థలతో పాటు మహిళా సంఘాలు, లోకల్ బాడీలలో కూడా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా రూపొందించాలన్నారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ, రైతులు తమ పంట పొలాల్లో గంజాయి మొక్కలు పెంచకుండా వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. గంజాయి పెంచే రైతులకు ప్రభుత్వం నుండి రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అందవని తెలియపరచాలని సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల నుండి మత్తు పదార్థాలు రాకుండా నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలలు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 25 డ్రగ్స్ కేసులు నమోదు చేసి 128 మందిపై చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా నిర్వహించే ఈవెంట్లలో మాదకద్రవ్యాలు వినియోగించరాదని సూచించారు. జిల్లాలో డ్రస్సును అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ ఫారెస్టు ఎక్సైజ్, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పనిచేసి ఎలాంటి సమాచారం అందిన వెంటనే పోలీసు శాఖకు తెలియపరచాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, ఫారెస్ట్ అధికారి జ్ఞానేశ్వర్, విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ జీవరాజ్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, అగ్రికల్చర్,రెవెన్యూ, సంక్షేమ శాఖల సహాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.