- నెవాడాలోని రెనో ఎయిర్ రేసింగ్ చాంపియన్షిప్ ముగింపు ఘటనలో విషాదం
- ల్యాండ్ అవుతున్న సమయంలో ఢీ
రెనో ఎయిర్ రేసింగ్ ఛాంపియన్షిప్ లో చివరి రోజు విషాద సంఘటన చోటుచేసుకుంది. రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో జరిగిందీ ఘటన. ఇక్కడి రెనో ఎయిర్ రేసింగ్లో విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నట్టు ఎయిర్ రేసింగ్ అసోసియేషన్ తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు విమానాలు ఢీకొన్నట్టు పేర్కొంది. ప్రమాదంలో మరణించిన పైలట్ల వివరాలు తెలియాల్సి ఉంది. రెనోలో నిర్వహించిన నేషనల్ చాంపియన్షిప్ ఎయిర్ రేస్ చివరి రోజు ఈ ఘటన సంభవించింది. విమానాలు ల్యాండవుతున్న సమయంలో ఢీకొన్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో మరెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు.