- యాచారం, ఇబ్రహీంపట్నంలలో దెబ్బతిన్న రియల్ ఎస్టేట్
- తగ్గిన రిజిస్ట్రేషన్లు
- అందని ద్రాక్షలా భుముల రెట్లు
- రియల్ రంగం పై ఎన్నికల ఎఫెక్ట్
ఇబ్రహీంపట్నం : రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. కరోనా సమయం నుంచి తగ్గుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. భూముల క్రయవిక్రయాల జోరు తగ్గిపోయింది. రియల్ఎస్టేట్ వ్యాపారం ఒడిదుడుకులకు గురవుతున్నది. అక్కడక్కడా లావాదేవీలు జరుగుతున్నా.. గతంలో చేసుకున్న ఒప్పందాలే తప్ప.. కొత్త కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముచ్చర్ల ఫార్మా సిటీ తెరపైకి తీసుకొచ్చినప్పటి నుంచి పరిసర ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం , మంచాల ,యాచారం లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. కానీ నేడు భూముల రెట్లు అందనంత పైకి ఎక్కడంతో అందని ద్రాక్షగా మారింది. దీంతో రియల్ వ్యాపారం చతకిలపడిరది. ఈ మూడు మండలాల వేలాది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ వ్యాపారంపై ఆధారపడి బతుకుతున్నారు. గత సంవత్సరం నుంచి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరగక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో రోజుకు కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఏడాది రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పట్టడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయింది. సాధారణంగా ప్రతి ఏడాది వేసవి సీజన్ ఆరంభంలో మాదిరిగానే ఒకటి రెండు నెలలు అన్సీజన్గా ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగిస్తుందని, ఏప్రిల్ నెలలో స్థిరాస్తులు, చరాస్థుల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గిపోయాయయని రియల్టర్లు అంటున్నారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు కాకముందే బ్రోకర్ల మాయా జాలంతో ధరలు ఆకాశన్నంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున ప్రతిపాదిత రహదారి అటకెక్కినట్లేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది.. రియల్ మార్కెట్ భారీ కుదుపునకు గురిచేసింది. దీంతో అప్పటివరకు దూకుడు మీద ఉన్న వ్యాపారం చతికిలపడిరది. అగ్రిమెంట్లు చేసుకొని అమ్ముకుందామనే దశలో కొనుగోలు దారులు ముందుకు రాకపోవడంతో ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు..
భారీగా పెరిగిన భూముల ధరలు…
యాచారం మండలంలోని నందివనపర్తి, యాచారం, తక్కళ్ళపల్లి, మాల్, సింగారం, చింతపట్ల , మరియు యాచారం నుంచి మాల్ వరకు సాగర్ రహదారి పక్కన భూములు హాట్ కేక్ లా మారిపోయాయి. గత నాలుగు సంవత్సరాల క్రితం లే ఔట్ లలో రూ. 6 వేల నుంచి 10 వేలు వున్న గజం విలువ నేడు రూ. 15 వేలకు పైగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే నివేశన స్థలాలతోపాటు వ్యవసాయభూములు, వాణిజ్య స్థలాల ధరలు యాచారం మండలంలో గణనీయంగా పెరుగడంతో సామాన్య, పేద ప్రజలకు అందకుండా పోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలను చూసి కొనుగోలు చేసేందుకు కూడా రియల్ఎస్టేట్ వ్యాపారులు కూడా కొంత వెనుకంజ వేస్తున్నారు…
రియల్ రంగంపై ఎన్నికల ఎఫెక్ట్…
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలు పూర్తయిన అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటుందని మండలంలోని రియల్ వ్యాపారులు కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వ వైభవం వస్తుందని ఆశపడుతున్నారు. ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా పికప్ కావచ్చనే ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు….