- 8రోజులు అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు
- అనుమతులు, ఆస్తులపై లోతైన విచారణ
హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 8 రోజుల కస్టడీకి ఏసీబీకి అనుమతి ఇస్తూ మంగళవారం నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎనిమిది రోజుల పాటు బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. విచారణ సందర్భంగా బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయనున్నారు. శివ బాలక్రిష్ణ మోసాలపై ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు. శివ బాలకృష్ణ పని చేసిన సమయంలో ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని పరిశీలించాలని ఏసీబీ నిర్ణయించింది. ఈ మేరకు హెచ్ఎండిఏ నుంచి ఫైల్స్ను తెప్పించుకుని విచారణ చేయనున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన నాంపల్లి ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. వివిధ మీడియాల్లో వచ్చిన కథనంపై అధికారులు విచారణ వేగవంతం చేయనున్నారు. పుప్పాలగూడలో రూ. వేయి కోట్లు ప్రాజెక్టు అనుమతులపై అవకతవకలు జరిగాయని.. దానికి సంబంధించిన ఫైల్స్ హెచ్ఎండిఏ ఇవ్వాలని కోరుతూ సంబంధిత అధికారులకు ఏసీబీ లేఖ రాసింది. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్.. ప్రస్తుత రెరా సెక్రటరీ శివబాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలలో ఏసీబీ ఆధికారులు ఐదు రోజుల క్రితం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. ఎనిమిది బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల సోదాలు చేశారు. మణికొండలోని ఆయన నివాస గృహంలో, అమీర్పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో కూడా తనిఖీలు చేశారు. 2018-2023 కాలంలో హెచ్ఎండీఏ ఎª`లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ.. అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్టు వచ్చిన ఆరోపణలు, వాటిపై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి, పదికి పైగా ఐఫోన్లు.. అత్యంత ఖరీదైన 50 వాచీలు.. కట్టలు కట్టలుగా నగదు.. ఆయన బీరువాలో 5 కిలోల బంగారు నగలు, 70 ఎకరాలకు సంబంధించిన భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.