జైపూర్ : బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు రాజస్థాన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. బ్యాంకు అకౌంట్లతో పాటు ఆర్థిక లావాదేవీలకు చెందిన సమాచారాన్ని ఇవ్వాలని రాజస్థానీ పోలీసులు కోరినట్లు మంత్రి తెలిపారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ రాజకీయ కక్షకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. జోధ్పూర్లోని ఇంటికి నోటీసులు ఇచ్చారని, తనకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి అని, అంతకుముందు తనకు ఎటువంటి నోటీసులు రాలేదని ఎంపీ షెకావత్ తెలిపారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో మంత్రి గజేంద్ర పాత్ర ఉన్నట్లు సీఎం గెహ్లాట్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు ఈ కేసును విచారిస్తున్నది. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, రాజకీయ కుట్రతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని కేంద్ర జలశక్తి మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం గెహ్లాట్పై కేంద్ర మంత్రి పరువునష్టం కేసును దాఖలు చేశారు.