Friday, May 17, 2024

బీజేపీ ప్రభుత్వం వైపే ప్రజల చూపు

తప్పక చదవండి
  • ఛతీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ

ఛతీస్‌గడ్‌ : ఛతీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కూడా తన స్టార్‌ క్యాంపెయినర్లతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రెండు రాష్ట్రాల్లో నిర్వహించిన ర్యాలీలకు విశేషమైన ప్రజాదరణ లభించింది. ఆయన తన ఎన్నికల ప్రచార అనుభవాలను ట్విట్టర్‌ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ఛత్తీస్‌గడ్‌ ఎన్నికల ప్రచారం గురించి ప్రస్తావిస్తూ.. ‘ఈసారి ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో నా అనుభవాలు అద్భుతంగా, అపురూపంగా ఉన్నాయి. ‘ఛత్తీస్‌గర్హియా – చాలా ఉత్తమమైనది’. కొత్త ఆశలు, కొత్త శక్తితో తమ రాష్ట్రాన్ని మరింత మెరుగ్గా, ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ఛత్తీస్‌గడ్‌ ప్రజలు ఎంతగానో కష్టపడుతున్నారు. ఛత్తీస్‌గడ్‌ను దుష్పరిపాలన, అవినీతి బారి నుంచి ఎవరైనా విముక్తం చేయగలిగితే అది బీజేపీ మాత్రమేనని వారికి తెలుసు. బీజేపీ చేసింది, బీజేపీ మాత్రమే అభివృద్ధి చేస్తుంది’ అని ప్రధాని మోడీ అన్నారు. ఛత్తీస్‌గడ్‌ రానున్న కొద్ది సంవత్సరాల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. నేడు రాష్ట్రంలో తొలిసారిగా ఓటు వేయబోతున్న యువత ఛత్తీస్‌గడ్‌ సుభిక్షంగా ఉండాలని కలలు కంటూ ముందుకు సాగుతున్నారు. రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారతదేశం అనే ప్రతిజ్ఞతో పాటు, అభివృద్ధి చెందిన ఛత్తీస్‌గడ్‌ ప్రతిజ్ఞ కూడా చేస్తారు. అభివృద్ధి చెందిన ఛత్తీస్‌గడ్‌-అభివృద్ధి చెందిన భారతదేశం కోసం తన జీవితంలోని రాబోయే 25 సంవత్సరాలను అంకితం చేయాలని యువత లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల యువత బీజేపీ అభివృద్ధి నమూనాతో అనుసంధానం అవుతున్న తీరు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. ఈ విధంగా ఛత్తీస్‌గడ్‌ యువత సరికొత్త శక్తితో మార్పు తీసుకొచ్చేందుకు ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహతారీ, మన సోదరీమణులు, కుమార్తెలు కూడా రాష్ట్ర అభివృద్ధిలో తమవంతు కృషి చేశారు. నేడు, భారతదేశం మహిళా సాధికారత కోసం ప్రయత్నాలు చేస్తున్న తీరు, ఛత్తీస్‌గడ్‌లో కూడా దాని ప్రభావాన్ని చూడవచ్చు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం ఖాయం. ప్రజలు బీజేపీ సుపరిపాలనను విశ్వసిస్తున్నారని, బీజేపీ తన ప్రతీ తీర్మానాన్ని నెరవేర్చడానికి కట్టుబడి ఉంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో త్వరలోనే అధికారంలోకి వచ్చే బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, శ్రేయస్సు కోసం హామీ ఇస్తుందని అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురించి ప్రస్తావిస్తూ.. ‘ప్రజల నుంచి ఆశీర్వాదం పొందాలనే ప్రయత్నంతో చేసిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా ప్రత్యేకమైనది. రాష్ట్రంలోని నలుమూలలకు వెళ్లి అనేక మందిని కలిశాను. బీజేపీపై ప్రజలకు ఉన్న అభిమానం, వారికి ఉన్న విశ్వాసమే మా అతిపెద్ద ఆస్తి. రాష్ట్రంలోని మహిళా శక్తి ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చి బీజేపీ జెండాను అందిపుచ్చుకుంది. మహిళా సాధికారతకు బీజేపీ ఎంత ప్రాధాన్యతనిస్తుందో, అదే విధంగా మహిళలు తిరిగి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు. నేటి కొత్తతరం.. రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశం ఎలా ఉండబోతోందోన్నది కలలు కంటున్నారు. అందుకే యువత భుజం భుజం కలిపి అభివృద్ధి చెందిన భారతదేశ తీర్మానాన్ని అమలులోకి తీసుకురావడానికి ముందుకు సాగుతున్నారు’ అని మోడీ అన్నారు. బీజేపీ మాత్రమే మధ్యప్రదేశ్‌ను 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన మధ్యప్రదేశ్‌గా మార్చగలదని ప్రజలకు అచంచల విశ్వాసం ఉంది. మధ్యప్రదేశ్‌ ప్రజలు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వ ప్రయోజనాలను చూస్తున్నారు. దాని అవసరాన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ వంశపారంపర్య రాజకీయాలు, నెగిటివిటీపై మధ్యప్రదేశ్‌ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నది ఈ ప్రచార ర్యాలీల్లో కనిపిస్తోంది. అభివృద్ధి చెందిన మధ్యప్రదేశ్‌ కోసం బీజేపీని, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కమలాన్ని ఎన్నుకోవాలని ఓటర్లందరినీ కోరుతున్నాను అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు