న్యూఢిల్లీ : ఇండియా కాదు.. భారత్. ఇప్పుడు ఇదే టాపిక్పై అంతటా చర్చ సాగుతోంది. దేశం పేరును భారత్గా మార్చాలన్న అంశమే ప్రతి చోట వినిపిస్తోంది. బర్నింగ్ టాపిక్గా మారిన ఆ అంశంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించారు. ఇండియా టుడేతో జరిగిన చాట్లో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన దేశం ఒరిజినల్ పేరు భారత్ అని, ఒకవేళ దేశం పేరును మార్చాలనుకుంటే, అప్పుడు ఆ మార్పును అన్నింటిల్లో చేయాలని గవాస్కర్ తెలిపారు. ఆ మార్పు అధికారిక స్థాయిలో జరగాలన్నారు. గవర్నమెంట్ స్థాయిలో, బీసీసీఐ స్థాయిలో ఆ మార్పు జరగాలన్నారు. ఇండియన్ క్రికెట్ జట్టును.. భారత్ క్రికెట్ జట్టు అని పిలవాలంటే మార్పులు పైస్థాయిలో జరగాలన్నారు. దేశం పేరును భారత్గా మారుస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆ అంశంపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. క్రికెటర్ల జెర్సీలపై భారత్ అని రాయాలని బీసీసీఐ కార్యదర్శి జేషాకు సెహ్వాగ్ లేఖ కూడా రాశారు. దేశం పేరు మనల్ని గర్వంగా నిలుపుతుందని, మనం భారతీయులమని, బ్రిటీషర్లు ఇండియా పేరును పెట్టారని, భారత్ అనే పేరు మళ్లీ మనకు దక్కేందుకు చాలా సమయం పట్టిందని సెహ్వాగ్ అన్నారు.