Monday, May 6, 2024

కృత్రిమ మేధను దుర్వినియోగం

తప్పక చదవండి
  • డీప్‌ఫేక్‌లను సృష్టిస్తున్నారు
  • దుర్వినియోగం అవుతున్న ఏఐ
  • డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించడం ఆందోళనకరం
  • ప్రజలకు మీడియా అవగాహన కల్పించాలి
  • ‘దివాలీ మిలన్‌’ కార్యక్రమంలో మోడీ

న్యూఢిల్లీ : ‘డీప్‌ ఫేక్‌లను’ సృష్టించి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించడం పెను ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ప్రజలకు మీడియా అవగాహన కల్పించాలని కోరారు. దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘దివాలీ మిలన్‌’ కార్యక్రమానికి హాజరైన మోడీ.. పాత్రికేయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మధ్యే ఓ వీడియో చూశా. అందులో నేను గర్బా పాట పాడుతున్నట్లు ఉంది. ఇలాంటివి ఆన్‌లైన్‌లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. డీప్‌ఫేక్‌ ఆందోళనకరమైన సమస్యగా మారింది. మనందరికీ ఇది చాలా సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ప్రమాదకరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేస్తే కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. భారతదేశాన్ని ‘వికసిత్‌ భారత్‌’ (అభివృద్ధి చెందిన భారతదేశం)గా మార్చాలనే తన సంకల్పాన్ని మోడీ.. ఈ సందర్భంగా ప్రస్తావించారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌కు ప్రజల మద్దతు లభించిందని తెలిపారు. కొవిడ్‌ సమయంలో భారత్‌ సాధించిన విజయాలు.. దేశ అభివృద్ధి ఇప్పట్లో ఆగదనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించాయని చెప్పారు. సోషల్‌ మీడియా సంస్థలతో సమావేశం మరోవైపు.. డీప్‌ఫేక్‌ సమస్య ను పరిష్కరించాలని సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై కేంద్రం నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని కోరింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, యూట్యూబ్‌కు సందేశం పంపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డీప్‌ఫేక్‌ వంటి కంటెంట్‌ ఎక్కువగా వ్యాప్తి చెందడానికి సోషల్‌ మీడియాలు ప్రధాన కారణమని భావిస్తున్న నేపథ్యంలో.. ఆ కంపెనీలతో చర్చించడం మంచిదని పేర్కొన్నాయి. సోషల్‌ మీడియా సంస్థలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు ఇప్పటికే వెల్లడిరచాయని, ఈ నేపథ్యంలోనే సమావేశం నిర్వహించి చర్చించేందుకు కేంద్రం సిద్ధమైందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సహా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. డీప్‌ఫేక్‌ సమస్యపై కేంద్రం ఆందోళన చెందుతోందని వివరించాయి. కేంద్ర ఐటీ శాఖ, సంబంధిత మంత్రిత్వ శాఖలు దీనిపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నాయని వివరించాయి. ఇటీవల నటి రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర కలకలం సృష్టించింది. అనేక మంది సెలబ్రిటీలు ఈ వీడియోను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. దీంతో డీప్‌ఫేక్‌పై ఆందోళన మిన్నంటింది. సమస్యను పరిష్కరించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు