Monday, May 6, 2024

రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి ఎక్కడా లేదు

తప్పక చదవండి
  • గాల్లో వచ్చిన వాళ్లు గాల్లోనే పోతారు
  • పాలమూరు వలసలు ఆగలేదు
  • వ్యవసాయ భూములు పచ్చగా మారలేదు
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ బీఆర్‌ఎస్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో ఎవరు ముఖ్యమంత్రి కావాలో వారిలో వారికే స్పష్టమైన అవగాహన లేదని బండి సంజయ్‌ అన్నారు. పాలమూరు వలసలు ఆగలేదని, వ్యవసాయ భూములు పచ్చగా మారలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి ఎక్కడా లేదని, గాల్లో వచ్చిన వాళ్లు గాల్లోనే పోతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బొక్కలోనిపల్లి కూడలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో ఎవరిని గెలిపించినా.. వాళ్లు బీఆర్‌ఎస్‌లోనే చేరతారన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న అంశంపై గొడవ మొదలైందని, ఒకరికిస్తే ఇంకొకరు పార్టీని వదిలి వెళ్లే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. పొరపాటున బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు అధికారంలోకి వస్తే మధ్యంతర ఎన్నికలు తథ్యమని జోస్యం చెప్పారు. ఏడాదిలో వంద గదుల ఇళ్లు నిర్మించుకున్న కేసీఆర్‌ పేదలకు మాత్రం ఇళ్లు ఇవ్వలేదని, కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్‌ నిరుద్యోగులకు మాత్రం మొండి చేయి చూపారన్నారు. పాలమూరులో వలసలు ఆగలేదని.. పచ్చగా మారలేదన్నారు. పక్క రాష్ట్రం నీళ్లు తీసుకెళ్తుంటే కమీషన్లు తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉన్నారని బండి సంజయ్‌ విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించి శ్రీనివాస్‌గౌడ్‌ను ఎమ్మెల్యే చేస్తే ఏం చేశారని ప్రశ్నించారు. ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌ కార్డులు సహా సంక్షేమ పథకాలు ఎందుకు రాలేదని శ్రీనివాస్‌ గౌడ్‌ను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి మోడీ నిధులిస్తే రోడ్లు, పల్లెలు, పట్టణాలు బాగు చేసుకుని, కేసీఆర్‌ ఫొటో పెడుతున్నారని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్‌కు మోడీ ఇచ్చిన నిధులెన్నో.. కేసీఆర్‌ ఇచ్చిన నిధులెన్నో.. లెక్క చెప్పమని మంత్రిని ప్రజలు నిలదీయాలన్నారు. ఎక్కడ కేసీఆర్‌ మీటింగ్‌ పెట్టినా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని.. డబ్బులు ఇచ్చినా ముఖ్యమంత్రి సభకు ఎవరూ రావడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నో కేసులు తనపై అధికార పార్టీ పెట్టిందని.. ప్రజల సమస్యలపై పోరాడి ఎన్నోసార్లు జైలుకు వెళ్లానని.. మైనార్టీ మహిళల కోసమే త్రిపుల్‌ తలాక్‌ రద్దు చేశారని తెలిపారు. పాలమూరులో కాషాయ జెండా తప్పక ఎగురుతుందని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులనే నమ్ముకున్నారని, ఓటుకు రూ.10వేలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఎంత డబ్బిచ్చినా తీసుకుని ఓటు మాత్రం బీజేపీ కి వేయాలని సంజయ్‌ కోరారు. ఇళ్లు, ఉద్యోగాలు, పెన్షన్లు, రేషన్‌ కార్డులు రావాలన్నా, పాలమూరు పచ్చగా మారాలన్నా బీజేపీకి ఓటేయాలని సంజయ్‌ కోరారు. తెలంగాణలో మోడీ రాజ్యం వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారమిచ్చినా ఏం చేయని వాళ్లకు ఓటేస్తే ప్రజల బతుకులు ఎలా బాగుపడుతాయని ప్రశ్నించారు. మార్పు కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు