- 2035 నాటికి అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి
- 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడు ఉండాలి
న్యూఢిల్లీ : రోదసీ రంగంలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు కీలక లక్ష్యాలు నిర్దేశించారు ప్రధాని నరేంద్ర మోడీ. 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడిని పంపే విధంగా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. 2035 నాటికి భారత స్పేస్ సెంటర్ను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ మిషన్ ఏర్పాట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్షించారు. త్వరలోనే మానవరహిత ఫ్లైట్ టెస్టులు నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాని.. ఆ వివరాలను మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడిరచింది. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు భారత్ చేపట్టనున్న ఈ తొలి మిషన్.. 2025లో జరిగే అవకాశం ఉందని పీఎంఓ పేర్కొంది. అక్టోబర్ 21న గగన్యాన్ తొలి ఫ్లైట్ టెస్టును ఇస్రో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా.. మరిన్ని కొత్త పరిశోధనలు చేపట్టాలని ఇస్రో శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. భవిష్యత్లో చేపట్టబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడిని పంపించాలని ఇస్రో శాస్త్రవేత్తలకు మోడీ సూచించారు. 2035 నాటికి అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంగారక గ్రహంపైకి ల్యాండర్ను పంపించాలని మోడీ పేర్కొన్నారు. శుక్రగ్రహం వద్దకు ఆర్బిటార్ను పంపించే మిషన్పై పని చేయాలని సూచించారు. గగన్యాన్ మిషన్ పురోగతిపై చేపట్టిన ఉన్నత స్థాయి సమీక్షలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గగన్యాన్ మిషన్పై సమగ్ర వివరాలను మోడీకి సోమనాథ్ తెలియజేశారు. ఇప్పటివరకు అభివృద్ధి చేసిన సాంకేతికతల గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 20 భారీ ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది. మూడు మానవరహిత మిషన్లను ప్రయోగించనుంది.