- మెట్రో, ఫార్మాసిటీలను రద్దుచేయం
- అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం
- ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్కు మెట్రో పొడిగింపు
- ఎంజిబిఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్కు లైన్
- ఫార్మాసిటీని ప్రత్యేక క్లస్టర్గా అభివృద్ది
- జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం
- అధికారులతో సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : మెట్రో పొడిగింపు, ఫార్మా సిటీలను రద్దు చేయమని, వాటిని స్ట్రీమ్లైన్ చేసి అందుబాటులోకి తీసుకుని వస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు. ఈ రెండుకూడా గతంకన్నామిన్నగా ఉంటాయని అన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో లైన్ ఉంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో, ఫార్మాసిటీలను రద్దు చేయడం లేదని.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్లైన్ చేస్తున్నామని చెప్పారు. ఎయిర్పోర్టుకి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే ఇప్పుడు దూరం తగ్గుంతుందని అన్నారు. బిహెచ్ఇఎల్ నుంచి ఎయిర్పోర్టు వరకు 32 కిలోమీటర్లు వస్తుందన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్పోర్టు కి వెళ్లే మెట్రోలైన్కి లింక్ చేస్తామన్నారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు… అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్సిల్ డిస్టిక్ట్ వరకు పొడిగిస్తాం. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టుకి మెట్రోకి వెళ్లేవారు దాదాపు ఉండరని చెప్పారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందని తెలిపారు. ఫార్మాసిటీని అంచలంచలుగా రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకి అదే ప్రాంతాల్లో గృహనిర్మాణం కూడా ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అక్కడి వాళ్లు ఎవ్వరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేటట్లు క్లస్టర్లు ఉంటాయని చెప్పారు. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మారుస్తామన్నారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్పై శిక్షణ ఉంటుందన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని.. స్కిల్స్ అదనంగా ఉంటాయని చెప్పారు. అక్కడ నుంచి బైటకి వెళ్లేవాళ్లకి క్యాంపస్లోనే ఎంపిక ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని.. ఆయాదేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని చెప్పారు. ఇందువల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామని చెప్పారు. యువతకు ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామని.. చాలా మంది సీనియర్ అధికారులు ప్రావీణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని తెలిపారు. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. 100 బెడ్స్ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు. 3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. తనకు దగ్గర, బంధువులనో పదవులు ఇచ్చేది ఉండదన్నారు. తాను ఏది చేసినా విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తానని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్లకు కమిషనర్లను నియమించామని వారికీ అవసరమైన మ్యాన్పవర్ను వాళ్లే ఎంపిక చేసుకుంటారని చెప్పారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమిస్తానని వాళ్ల పరిధిలో అవసరమైన అధికార్లను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేటట్లు చూసుకోవాలని సూచించారు. అధికార్ల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తామన్నారు. సంస్కరణలు తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలిపారు. తన వద్ద చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదన్నారు. జర్నలిస్టులకు సంబంధించి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని.. ఇప్పటి నుంచి వందరోజుల్లో పరిష్కరిస్తామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.