ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జే అనిరుధ్రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ తదితరులు హాజరై మల్లు రవికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. తనను ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన సీఎం రేవంత్రెడ్డి, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో నాలుగేండ్ల ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన అనుభవం తనకు ఉందనీ, ఆ అనుభవంతో కేంద్ర ప్రభుత్వంలోనూ మంత్రులు, అధికారులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు అనేక నీటి పారుదల ప్రాజెక్టులు, ఆర్ధిక, రక్షణ శాఖకు చెందిన అనేక అంశాలు పెండింగ్లో ఉన్నందున ప్రత్యేక ప్రతినిధిగా అనుభవజ్ఞుడైన తనకు బాధ్యతలు ఇచ్చారని ఆయన తెలిపారు. తనకు ఉద్యోగం వచ్చినట్టు అనుకోవడం లేదని, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్, కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖ భూములు వంటి అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశలో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ప్రధాన మంత్రి ని కలిసి 15 అంశాలతో విజ్ఞాపనలు అందజేశారని తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరుతున్నామన్నారు. అదే విధంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం మీడియా కూడా తమకు సహక రించాలని, వారి దృష్టికి వచ్చిన అంశాలను తమకు తెలపాలని కోరారు. సాధ్య మైనంత ఎక్కువ సమయం అధికారులు, మీడియాకు అందుబాటులో ఉంటా నన్నారు.