- ఎగ్జిట్పోల్స్పై ఆందోళన వద్దు
- బీఆర్ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించబోతుంది
- 3న సంబురాలు చేసుకుందాం
- ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ భరోసా
- అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్ ధీమా
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేడు తనను కలిసిన నేతలతో పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై చర్చించిన గులాబీ దళపతి.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పరేషాన్ కావొద్దని.. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించబోతుందని పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతిభవన్లో పలువురు నేతలు కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సీఎం వారితో మాట్లాడారు. ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని.. రాష్ట్రాన్ని పాలించబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని చెప్పినట్లు సమాచారం. ఓపిక పడితే 3వ తేదీన సంబురాలు చేసుకుందామని పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.ఇదిలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 2018లోనూ ఎగ్జిట్ పోల్స్లో ఒక్క సంస్థ మాత్రమే టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) గెలుస్తుందని సరిగా చెప్పిందని.. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఓడిపోతుందని చాలా సంస్థలు చెప్పాయని గుర్తు చేశారు. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ తప్పాయన్న ఆయన.. అప్పుడు ఫలితాలు ఎలా వచ్చాయో.. ఈసారి కూడా అలాంటి ఫలితాలే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇదే తొలిసారి కాదని మంత్రి స్పష్టం చేశారు. ఈసారి 80కి పైగా స్థానాలు వస్తాయని అనుకున్నామని.. కానీ 70 వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్కు అంత శాస్త్రీయ ఉందని అనుకోవట్లేదని చెప్పారు. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరుగుతుందని వెల్లడిరచారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. అదేవిధంగా కేటీఆర్ విజయంపై ధీమాను పునరుద్ఘాటిస్తూ ఇవాళ మరో ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎక్కువ చేసి చూపించినా.. వాస్తవ ఫలితాలు తమకే శుభవార్త చెబుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయినట్లు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్పై కేటీఆర్ సీరియస్ – 100 శాతం అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. తెలంగాణ శాసనసభకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. ఓట్ల లెక్కింపునకు సమయం ఉండడంతో.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు..? సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా..? వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ప్రజల్లో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్పై కూడా జనాలు దృష్టి సారించారు. పలు సర్వే సంస్థలు వివిధ రకాలుగా ఎగ్జిట్ పోల్స్ను వెల్లడిరచాయి. అధికార బీఆర్ఎస్ పార్టీనే హ్యాట్రిక్ కొట్టబోతుందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడిస్తే, కాంగ్రెస్దే అధికారమని మరికొన్ని సంస్థలు వెల్లడిరచాయి. నిన్నటి నుంచి ఎగ్జిట్ పోల్స్ విషయంలో ప్రజలు ఊగిసలాటలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే సంస్థ బీఆర్ఎస్దే మళ్లీ అధికారమని తేల్చేసింది. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి భారత్ రాష్ట్ర సమితి అధికారం స్వీకరించబోతుందని హెచ్కేఎస్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ వెల్లడిరచింది. అధికార పార్టీ బీఆర్ఎస్ 53 నుంచి 58, కాంగ్రెస్ 48-52, బీజేపీ 4-8, ఎంఐఎం 5-7, ఇతరులు 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని హెచ్కేఎస్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ వెల్లడిరచింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ రాష్ట్రంలో పాగా వేస్తుందని ఆ సర్వేలో స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నట్లు ఆ సర్వే చెప్పకనే చెప్పింది. ప్రతి నియోజకవర్గంలో విభిన్న వర్గాల నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాలపై సమగ్రంగా చర్చించి, అది పోలింగ్ బూత్లో అదే విధంగా కన్వర్ట్ అయిందనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు చెందిన ప్రభావవంతమైన నాయకులతో చర్చించి, అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఆ అభిప్రాయాలను ఓటర్ల అభిప్రాయాలతో సరిపోల్చడం కూడా జరిగింది. ఇక ప్రీ పోల్ నుంచి ఎగ్జిట్ పోల్ వరకు ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సర్వేను రూపొందించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి దృష్టి సారించి దాదాపు 8 నెలల పాటు విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిన్న పోలింగ్ ముగిసే సమయం వరకు పూర్తి స్థాయిలో గ్రౌండ్లో తిరిగి చేసిన సర్వే. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో ఈ సర్వే సంస్థ ఒక వాలంటీర్ను కలిగి ఉండటం. వారు ఎప్పటికప్పుడు హెచ్కేఎస్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ నిర్వాహకులతో చర్చలు జరపడం, ఓటర్ల అభిప్రాయాలతో ఇతర అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ సర్వేను వెల్లడిరచినట్లు సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు. గతంలో జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు హుజురాబాద్, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఈ సంస్థ వెల్లడిరచిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి.