వాషింగ్టన్ : అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొనడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణాంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్టన్ర్ యూనివర్సిటీ నిర్ణయించింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి 2021లో సౌత్ లేక్ యూనియన్లోని ఈ యూనివర్సిటీలో మాస్టర్స్ చేరారు. ఈ ఏడాది జనవరి 23న ఆమె కాలినడకన వెళ్తుండగా అతి వేగంతో దూసుకొచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. జాహ్నవి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన యూనివర్సిటీ వీసీ ఆమెకు మరణాంతరం డిగ్రీ ప్రదానం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. మరోవైపు, జాహ్నవి మరణం తర్వాత పోలీస్ అధికారి డానియల్ ఆడెరర్ జోకులు వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడిన వీడియో ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే.. దీనిపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. జాహ్నవి కందులకు న్యాయం చేయాలని, సియాటిల్ పోలీస్ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 200 మందికిపైగా విద్యార్థులు జాహ్నవి ప్రమాదానికి గురైన స్థలం వద్ద ర్యాలీ నిర్వహించారు. జాహ్నవి మృతిపై సీరియస్గా దర్యాప్తు జరుపాలని ఇండో అమెరికన్ చట్టసభ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.