- సేఫ్ ల్యాండిరగ్ కోసం కృషి చేస్తున్న ఇస్రో..
- ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచం..
- ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు..
బెంగళూరు :
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ – 3 ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే ఈ సాయంత్రం విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్ – 3 సేఫ్ ల్యాండింగ్ కు ఇస్రో సర్వం సిద్ధంచేసింది. దీనికోసం యావత్ భారతమేకాదు ప్రపంచ దేశాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధృవంపై సాప్ట్ ల్యాండింగ్ కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషణ కొనసాగిస్తోంది. కాగా, 70 కిలోవిూటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలను ల్యాండర్ తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ట్విట్టర్ లో పోస్టు చేసింది. విక్రమ్ ల్యాండర్కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఈ ఫొటోలను తీసినట్లు తెలిపింది. మిషన్ షెడ్యూల్లో ఉందని.. సిస్టమ్లు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నట్లు పేర్కొంది. సున్నితమైన సెయిలింగ్ కొనసాగుతోందని తెలిపింది. చంద్రయాన్ – 3 సేఫ్ ల్యాండిరగ్ ప్రత్యక్ష ప్రసారం ఈ సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది.. ఈ సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. తొలుత నేడు సాయంత్రం 5.47 గంటలకు సాప్ట్ ల్యాండింగ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ఈ సమయంలో మార్పు చేశారు. 17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ను చంద్రుడిపై దించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇస్రో ట్విట్టర్ ద్వారా ఇప్పటికే వెల్లడించింది.. మరోవైపు చంద్రయాన్ – 3 కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా – 25 ప్రయోగం విఫలమవడంతో ఇప్పుడు అందరి కళ్లూ చంద్రయాన్ – 3 పైనే ఉన్నాయి. చారిత్రక ఘట్టం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి అపూర్వ ఘట్టం నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చంద్రయాన్ – 3 సేఫ్ ల్యాండింగ్ ను విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈవోలు, ప్రిన్సిపల్స్కు ఆదేశాలు జారీచేశారు.