టిక్కెట్ల కేటాయింపుపై డికె అరుణ పెదవి విరుపు..
హైదరాబాద్ :
తమ అభ్యర్థుల టికెట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. ఎన్ని తప్పులు చేసినా అగ్రవర్ణాలకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారన్నారు. బీసీలకు 22 సీట్లే కేటాయింపు అన్యాయమన్నారు. ముదిరాజ్లకు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వకపోవటం దుర్మార్గమన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తారన్న అహంకారంతో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కావలంటోన్న కవిత ఇప్పుడేమంటదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మహిళలకు కేవలం 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణలో కనీసం మహిళల రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలపై రోజుకో అఘాయిత్యాం జరుగుతోందన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న విూర్ పేటలో గంజాయ్ తాగి కత్తులతో బెదిరించి బాలికను అత్యాచారం చేశారని తెలిపారు. రాజకీయాల్లోకి అధికారులు రావాలి అనుకుంటే రాజీనామా చేసి రావాలన్నారు. అధికరాన్ని అడ్డపెట్టుకునే రాజకీయాలు చేయడం సరికాదని డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.