- ధరణి ఎత్తేస్తే మళ్లీ రైతులు గోస పడతారు : మంత్రి కేటీఆర్
కామారెడ్డి : కాంగ్రెసోళ్లు ధరణి ఎత్తేసి, పట్వారీ వ్యవస్థను తీసుకురావాలని అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్వారీ వ్యవస్థ వద్దు.. ధరణి ముద్దు అనేటోళ్లు తమకు ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గం పెద్దమల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ధరణి పోర్టల్ను ఎత్తేసి పట్వారీ వ్యవస్థ తీసుకురావాలని కాంగ్రెసోళ్లు అంటున్నారు. పట్వారీలను తీసుకొచ్చి మళ్లీ మన జీవితాలను ఆగం చేస్తారట..? రైతులను చావగొట్టి దళారుల రాజ్యం తెస్తామని అంటున్నారు. 24 గంటల కరెంట్ కావాలంటే కేసీఆర్కు ఓటేయండి. పట్వారీ వ్యవస్థ వద్దు.. ధరణి ముద్దు అనేటోళ్లు మాకు ఓటేయండి. ధరణిలో కూడా ఇబ్బందులు ఉండొచ్చు. ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మంచిగా చేసుకుందాం. ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లును కాలబెట్టుకోం కదా..? ధరణి కూడా 90 శాతం మంచిగా ఉన్నది. ఆ పది శాతం కూడా సరి చేసుకుందాం. పాత పట్వారీ వ్యవస్థ వద్దు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నటికైనా మనోడు మనోడు అయితడు.. మందోడు మందోడు అయితడు. తెలంగాణపై కేసీఆర్కు ఉండే ప్రేమ రాహుల్, మోదీకి ఉంటదా..? మరి మనోడిని గెలిపించుకుందామా..? లేకపోతే ఢల్లీి వాళ్లను నెత్తి మీద పెట్టుకుందామా..? ఆలోచించండి. కామారెడ్డికి వస్తున్న కేసీఆర్ను ఆశీర్వదించండి. ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. కేసీఆర్ వచ్చిండు అంటే బ్రహ్మాండమైన అభివృద్ధి ప్రతి గ్రామంలో జరుగుతుంది. మీ పొలాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి. ఇప్పటికే కాళేశ్వరం జలాలు మంచిప్ప దాకా వచ్చాయి. రాబోయే ఏడాదిలో మీదాకా తీసుకొచ్చే బాధ్యత నాది. మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్కు ఇచ్చి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పెద్దమల్లారెడ్డికి వస్తుంటే వడ్లు కుప్పలు కుప్పలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఇట్ల వడ్ల రాశులు కనిపించాయా..? గతంలో కరెంట్ కష్టాలు ఉండే. అన్ని మంచిగా చేసుకుంటుంటే ఇవాళ కాంగ్రెసోళ్లకు మనసున పడుతలేదు. మళ్లా ఆగం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ రెండు టర్మ్ల్లో మంచి పనులు చేసుకున్నాం. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం చేశాం. కాంగ్రెస్ పార్టీ బీడీ కార్మికులను పట్టించుకోలేదు. గతంలో పెన్షన్లు ఇవ్వకపోతే కాంగ్రెసోడిని అడిగినోడు లేడు. చేసింది లేదు. ఇవాళ ఇచ్చేతోని తిడుతున్నారు. నడిచే ఎద్దునే పొడుస్తం కానీ దున్నుపోతును పొడవం కదా అంటున్నారు. మీకు కూడా వస్తాయి పెన్షన్లు, తెల్ల కార్డులు వస్తాయి. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్. కలిసోచ్చే కాలానికి నడిచిచొచ్చే కొడుకు వస్తడట. అట్ల కేసీఆరే మీ దగ్గరికి వచ్చిండు కామారెడ్డికి. అన్నీ మీకు సౌలత్లు అవుతాయి. కాని పనేమీ ఉండదు. కాంగ్రెస్ను నమ్మి ఆగం కావొద్దు అని కేటీఆర్ సూచించారు.