- మంజీరాను ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ
- తెలంగాణలో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నామన్న కేసీఆర్
- రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నామన్న ముఖ్యమంత్రి
మెదక్ : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో మెదక్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ వచ్చింది.. అది పద్మా దేవేందర్ రెడ్డి పవర్ అని కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రామాయంపేట ప్రజలు.. పద్మా దేవేందర్ రెడ్డి పవర్ ఏందో చూశారు కాదా..? ఆర్డీవో ఆఫీసు వచ్చిందా..? హరీశ్రావు ప్రారంభించిండా..? డిగ్రీ కాలేజీ వచ్చిందా..? ఇవన్నీ వచ్చాయి.. పద్మాదేవేందర్ రెడ్డి నా బిడ్డ అని ఉట్టిగా చెప్పలేదు. ఆమె అనుకుంటే పనులు ఎలా అవుతున్నాయో మీరు చూస్తున్నారు. హెలికాప్టర్లో వస్తూ మంజీరా నది చూశాను. నీళ్లతో నిండుగా కనబడుతుంది. గతంలో మంజీరాను ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాల్వల్లో చెట్లు, గడ్డి మొలిచి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నీళ్లు పారుతున్నాయి. పద్మా చొరవ తీసుకోవడంతో, బ్రహ్మాండంగా బాగు చేసుకున్నాం. ఘణపురం ఆయకట్టు కింద 40 వేల ఎకరాలు పండుతుంది. మీ నెత్తిమీదనే కుండలాగా మల్లన్నసాగర్ ఉంది. మెదక్ హైట్లో ఉంది కాబట్టి సంపూర్ణంగా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. ఇప్పటికే చాలా ప్రాంతాలకు నీళ్లు వచ్చాయి. రాని ఏరియాకు నీళ్లు తెచ్చి ఇస్తా. నర్సాపూర్ కాల్వలు తవ్వుతున్నారు. అవి పూర్తవుతాయి. ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏండ్లు మన గోసపోసుకుని, ఉద్యమాలు చేస్తే, మన పిల్లల్ని కాల్చి చంపి, రాచిచంపాన పెట్టిన కాంగ్రెస్ కొత్త రూపంతో మళ్లీ వస్తుంది. మోసపోతే మళ్లీ గోసపడుతాం అని కేసీఆర్ అన్నారు.
ఆ దిష్టిబొమ్మ గెలవాలి.. మనం ఓడిపోవాల్నా..?
పొద్దున్నుంచి రాత్రి వరకు మీ మధ్యలో ఉండే పద్మ గెలిస్తే.. మీ కోసం పని చేస్తుంది. రింగ్ రోడ్డు, ఇంజినీరింగ్ కాలేజీ ఆటోమేటిక్గా నడుచుకుంటూ వస్తయి. ఆ అవకాశం పొగొట్టుకుంటే చాలా ప్రమాదం అయితది. మళ్లీ తెలంగాణ ఇబ్బందుల పాలవుతది. సంపద పెంచుకుంటూ ప్రజలకు పంచుకుంటూ ముందుకు పోతుంది బీఆర్ఎస్ పార్టీ. సంపద పెంచలేదు.. మనల్ని సర్వనాశనం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మళ్లా ఇప్పుడు వచ్చి తమాషాలు చెబుతున్నారు. పద్మా దేవేందర్ రెడ్డికి, ఆ కాంగ్రెస్ల నిలవడ్డొనికి ఏమన్నా పోలిక ఉందా..? ఏదో దిష్టిబొమ్మను తీసుకొచ్చి పద్మ ఎదురుగా పెడితే.. ఆయన గెలవాలి.. మనం ఓడిపోవాల్నా..? పద్మా గెలవాలి. వంద శాతం గెలిపించండి.. మీ తరపున ఆమె కోరిన కోరికలను తీర్చే బాద్యత నాది అని కేసీఆర్ హామీ ఇచ్చారు.