- ప్రమాదంలో 15మంది కార్మికులకు గాయాలు
- ఘటనపై సిఎం రేవంత్ దిగ్బ్రాంతి
హైదరాబాద్ : హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ క్యాంటీన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 15 మందికి గాయాలవగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కరాచీ బేకరీ గోడౌన్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మంది కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికులేనని అధికారులు సీఎంకు తెలిపారు. గాయపడిన వారిలో ఎనిమిది మందిని కంచన్ బాగ్ డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శిని రేవంత్ ఆదేశించారు.