- అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్పై రిటైర్డ్ జడ్జితో విచారణ
- బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు
- బీసీ ముఖ్యమంత్రి హామీ అందరినీ ఆకర్షిస్తోందని వెల్లడి
- బీజేపీ ఓ మాట చెబితే కట్టుబడి ఉంటుందని అందరికీ అర్థమైందని వ్యాఖ్య
- బీఆర్ఎస్, కాంగ్రెస్ పనులు ప్రగతి భవన్, గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా
హైదరాబాద్ : అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ రానున్న వారం రోజుల్లో ప్రధాని మోదీ ఆరు సభల్లో పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల చేతిలోకి చిప్ప వస్తుందని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతికి మూల్యం తప్పదని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ, ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాని కాంగ్రెస్కు బీజేపీని విమర్శించే హక్కు లేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హావిూ ఇచ్చారు. ఫీజులపై నియంత్రణ తీసుకొస్తాంమని… విద్య, వైద్య రంగాన్ని తీర్చి దిద్దుతామన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజల నెత్తివిూద భస్మాసుర హస్తమంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేధావులు, కవులు, కళాకారులు అలోచన చేయాలన్నారు. రైతులు సహా.. అన్ని వర్గాల నుంచి బీజేపీ మ్యానిఫెస్టోకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. బీసీ, ఎస్సీలు బీజేపీ వెంట పూర్తిస్థాయిలో నడవబోతున్నారన్నారు. రైతుబంధును కొనసాగిస్తామని.. వరి పంటకు రూ.3,100 కనీస మద్దతు ధర ఇస్తామన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్ల కంటే ఎక్కువ అవసరం ఉండదని తెలిపారు. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని.. దేశవాళీ ఆవులను రైతులకు ఇస్తామన్నారు. నాలుగు శాతం మతపరమైన రిజర్వేషన్లను ఎత్తేసి హైకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీవి ఆచరణ సాధ్యం కాని హావిూలన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కు లేదు. ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా అంటూ కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
యువత, మహిళలు ప్రధాని మోదీకి అండగా నిలబడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా బీజేపీకి జైకొడుతున్నట్లు చెప్పారు. ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండేది బీజేపీ మాత్రమేననే అభిప్రాయం అందరిలోనూ ఉందన్నారు. ఇతర పార్టీల నేతల మాటలు కోటలు దాటుతాయని, కానీ చేసే పని మాత్రం ప్రగతి భవన్, గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా చేశారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ప్రజలకు విషాదమే మిగిల్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కారణంగా తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తొలి విడతలో 369 మంది, మలివిడతలో 1200 మందిని కాంగ్రెస్ బలితీసుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తోన్న ఫేక్ గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. బడుగు బలహీనవర్గాలు, షెడ్యూల్ తెగల ప్రజలు బీజేపీని విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉందని, తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోందని చెప్పారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారన్నారు.