- పోలింగ్ కేంద్రాల్లో బీ.ఆర్.ఎస్ నాయకులు రిగ్గింగ్కు
పాల్పడుతున్నారని బీ.ఎస్.పీ స్టేట్ చీఫ్ ప్రవీణ్కుమార్ ఆందోళన. - ప్రతిగా బీ.ఆర్.ఎస్ నాయకుల ఆందోళన.
- డీ.ఎస్.పీ, ఎస్.ఐలకు గాయాలు.
- పలువురు బీ.ఎస్.పీ, బీ.ఆర్.ఎస్ కార్యకర్తలకు సైతం గాయాలు
కాగజ్నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గురువారం సాయంత్రం ఎన్నికల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్ కు( దొంగ ఓట్లు) వేసుకుంటున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని 90 పోలింగ్ కేంద్రం ప్రభుత్వ ఉర్దూ పాఠశాల వద్ద బి.ఎస్. పి నాయకులు కార్య కర్తలు ఆందోళనకు దిగారు. దీనికి ప్రతిగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్ శ్రేణులు సైతం ఆందోళన కు దిగాయి. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురెదురుగా ఆందోళన కు దిగడంతో పరిస్థితి శృతి మించి దాడులకు పాల్పడ్డారు. చెప్పులు ,రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో బంధ బస్సులో ఉన్న డి.ఎస్ .పి ( కరీంనగర్) శ్రీనివాస్, కాగజ్ నగర్ టౌన్ ఎస్.ఐ గంగన్న తలలకు రాళ్లు తగలడంతో గాయాల పాలయ్యారు. అనంతరం పోలీసులు జరిపిన లాటి చార్జ్ లో పలువురు బి.ఆర్.ఎస్, బి.ఎస్.పి కార్యకర్తలకు సైతం గాయాలయ్యాయి. ఇందులో కొంతమంది బి .ఎస్ .పి మహిళా కార్యకర్తలు ఉన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల( ఓల్డ్), ఎక్సెల్ ప్రైవేట్ ఉన్నత పాఠశాల, ద్వారకా నగర్ లోని శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి బి.ఆర్.ఎస్ శ్రేణులు రిగ్గింగ్ కు పాల్పడుతున్నాయని బి. ఎస్ .పి స్టేట్ చీఫ్ , సిర్పూర్ బి.ఎస్.పి ఎమ్మెల్యేఅభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన చేయడం జరిగింది. కాగజ్ నగర్ లో బీ.ఎస్.పి, బి.ఆర్.ఎస్ వర్గాల మధ్య గొడవ తీవ్రతరం దాల్చడంతో సమాచారం తెలుసుకున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్ రావు గొడవ చోటు చేసుకున్న స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు అనంతరం బి.ఎస్.పి స్టేట్ చీఫ్ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ తో మాట్లాడి సంయమనం పాటించాలని కోరారు. అనంతరం అక్కడ నుంచి ఆందోళనకారులను పోలీసులు పంపించి వేశారు.