- ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారంటూ కేసు
- నిన్న రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
- 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించిన న్యాయమార్తి
- ప్రశాంత్తో పాటు అతని సోదరుడు కూడా జైలుకు
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. నిన్న గజ్వేల్ లో ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దాదాపు ఆరు గంటలసేపు ఆయనను విచారించారు. అనంతరం నిన్న రాత్రి జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్ తో పాటు, ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వీరికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్ విధించడంతో ప్రశాంత్, ఆయన సోదరుడిని చంచల్ గూడ జైలుకి పోలీసులు తరలించారు.
అసలు ఏం జరిగిందంటే..
బిగ్బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఈనెల 22న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులకు, మరో కంటెస్టెంట్ అమర్దీప్ అభిమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్.. స్టూడియోస్ నుంచి బయటకు రాగా.. అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, అదే సమయంలో రన్నరప్గా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. మరో కంటెస్టెంట్ అశ్విని కారు అద్దాలను పగలగొట్టారు. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు.
బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. తాము చెప్పిన వినిపించుకోకుండా అభిమానుల ఉన్న చోటుకు పల్లవి ప్రశాంత్ వెళ్లాడని చెప్పారు. ఈ దాడుల కేసులో ప్రశాంత్తో పాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏ3, ఏ4లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. తాజాగా ప్రశాంత్, అతని సోదురుడిని కూడా అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు పంపించారు.
నా తప్పు లేదు: ప్రశాంత్
అరెస్టుకు ముందు పల్లవి ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఉదయం తాను ఇంటి వద్ద నుంచి ఎవరికీ చెప్పకుండా పొలం వద్దకు వెళ్లి వచ్చానని, దానికే తాను అజ్ఞాతంలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. దాడి ఘటనలో తన ప్రమేయం లేదని అన్నారు. తానెక్కడా అభిమానులను రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తన వల్ల ఇబ్బందులు కలిగినట్లు భావిస్తే పోలీసులకు క్షమాపణ చెబుతున్నానని, అద్దాల ధ్వంసం ఘటనలో వాస్తవాలను బయటపెట్టాలని ప్రశాంత్ కోరాడు.