Monday, April 29, 2024

ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం

తప్పక చదవండి
  • సిబిఐ విచారణ కోరుతూ..ప్రధాని మోడీకి పవన్‌ కళ్యాణ్‌ లేఖ

అమరావతి : ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన 5 పేజీల లేఖ రాశారు వైకాపా పాలనలో భూసేకరణ పేరిట రూ.32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోంది. సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్దిదారులకు ఇవ్వలేదు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికే ఇచ్చారు. ప్రభుత్వం తీరుతో మిగతా లబ్దిదారులు విసుగుచెందారని పవన్‌ తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని తన 5 పేజీల లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతోంది. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయి. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ’పేదలందరికీ ఇళ్లు’ పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో 21.87,985 మందికే పట్టాలకు లబ్దిదారులను గుర్తించారు. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లే అవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం పథకంలో ప్రజాధనం భారీగా పక్కదారి పట్టించింది. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసింది. పీఎంఏవై (అర్బన్‌, రూరల్‌), జేజేఎం, ఎంజీఎన్‌ఆర్‌ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం నిర్వహణ పక్రియలో వైసీపీ ప్రభుత్వం తేదీల వారీగా ఇలా చేసింది. మొదట్లో కేవలం భూ సేకరణ కోసం రూ.35,151 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పిన లెక్కకు, పత్రికా ప్రకటనలో చెప్పిన లెక్కకు చాలా తేడా ఉంది. రాష్ట్ర బ్జడెట్‌ లో రూ.23,106.85 కోట్ల మేర కేటాయించి, వ్యయం చేసింది మాత్రం కేవలం రూ.11,358.87 కోట్లు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై (అర్బన్‌) పథకం ద్వారా రాష్టాన్రికి విడుదల చేసింది రూ.14,366.08 కోట్లు. మొత్తం పథకంలోని అన్ని విషయాలను గమనించి ఈ పథకం అమలు తీరుపై సీబీఐతో పాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న మరింత లోతైన అవినీతి బయటపడే అవకాశం ఉంది. అని పవన్‌ కల్యాణ్‌ మోదీకి లేఖలో వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు