- ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై సీవీ ఆనంద్ సంచలన ట్వీట్
- అన్ని శాఖల్లోనూ అవినీతి ఉందంటూ నెటిజన్ల కామెంట్
- రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి – సీవీ ఆనంద్ రిప్లై
తెలంగాణలో ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు రిప్లై ఇస్తూ.. రాష్ట్రంలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖలోనూ అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని .. సీవీ ఆనంద్ పేర్కొనటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.సీవీ ఆనంద్ లాంటి ఐపీఎస్ అధికారి బహిరంగంగా ప్రభుత్వ శాఖలపై ఇలాంటి కామెంట్ చేయటం మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. అందులోనూ.. ఆయన పని చేసిన పోలీస్ శాఖ కూడా ఉందని పేర్కొనటం గమనార్హం. ప్రభుత్వంలో భాగంగా ఉంటూ ఒక సామాన్య నెటిజన్లా స్పందింటంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సీవీ ఆనంద్ చేసిన ఈ ట్వీట్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తుండగా.. అందులో కొన్నింటికీ సమాధానాలు కూడా ఇచ్చారు సీవీ ఆనంద్.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. రమేష్ వైట్ల అనే జర్నలిస్టు ఏసీబీ రాకింగ్ అంటూ సీవీ ఆనంద్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు స్పందిస్తూ.. తెలంగాణలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖలో కూడా అవినీతి తీవ్రస్థాయిలో పెరిగిపోయిందంటూ రిప్లై ఇచ్చారు.
కల్లుగీత కార్మికుల లైసెన్సుల కోసం లంచం తీసుకుంటూ జడ్చర్ల ఎక్సైజ్ సీఐ రాత్నావత్ బాలోజీ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామానికి చెందిన గౌడ కులస్థులు టీఎఫ్టీ లైసెన్సు కోసం జనవరి 17న దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును జడ్చర్ల ఎక్సైజ్ సీఐ కార్యాలయానికి పంపించడంతో 18న బాధితులు.. సీఐ బాలోజీని కలిశారు. లైసెన్సు కావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని బాలోజీ డిమాండు చేయగా.. 90 వేలకు డీల్ కుదిరింది. ఇక అదే రోజు 25 వేలు కూడా ఇచ్చారు. మిగతా డబ్బు ఇచ్చే సమయంలో.. బాధితుడు ఏసీబీని ఆశ్రయించటంతో ప్లాన్ ప్రకారం రెడ్ హ్యాండెడ్గా సీఐని అధికారులు అరెస్ట్ చేశారు.. .సీవీ ఆనంద్ పేర్కొన్న శాఖలు మాత్రమే కాదని.. అన్ని శాఖల్లోనూ అవినీతి కంపుకొడుతోందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లంచం ఆరోపణలపై సస్పెండ్ అయిన ఓ అధికారి తిరిగి డిపార్ట్మెంట్లో చేరారని ఓ నెటిజన్ చేసిన కామెంట్కు రాజకీయ, ఇతర ఒత్తిళ్ల కారణంగా కొన్నిసార్లు ఇటువంటివి జరుగుతాయంటూ సీవీ ఆనంద్ రిప్లై కూడా ఇచ్చారు.