– హింసించడమే అతని నైజం..
– టెర్రరిస్టులకు హైద్రాబాద్ పాతబస్తీ అడ్డా..
– ఒవైసీ కాలేజీలో హెచ్ఓడీగా ఉగ్రవాది..
– అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమేశ్ ని
సలహాదారుడిగా ఎలా నియమిస్తారు..?
– సంచలన ఆరోపణలు చేసిన బండి సంజయ్..
హైదరాబాద్, 10 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
హైదరాబాద్లో ఉగ్ర అనుమానితులను అరెస్టు చేసిన అంశంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా హైదరాబాద్లో మంగళవారం చేపట్టిన ఆపరేషన్లో ఐదుగురు హిజ్బూ ఉత్ తహరీర్ (హెచ్యూటీ) సంస్థ ఉగ్రవాద అనుమానితులు దొరికిన సంగతి తెలిసిందే. వీరు అందరికీ ప్రధాన సూత్రధారిగా ఉన్న మహ్మద్ సలీం అనే వ్యక్తి ఓ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నాడని పోలీసులు చెప్పారు. పట్టుబడినవారిలో ఒక డెంటిస్టు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉన్నారు.
దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ.. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఒవైసీ కుటుంబానికి చెందిన దక్కన్ కాలేజీలోనే ఆ వ్యక్తి హెచ్వోడీగా పనిచేస్తున్నాడని అన్నారు. ఒవైసీ టెర్రరిస్టులకు సపోర్టు చేస్తానని గతంలోనే ప్రకటించారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం ఇస్తోందని అన్నారు. రాజకీయాల కోసం ఉగ్రవాద సంస్థలను ఎంఐఎం వాడుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. ఓట్ల కోసం ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్న ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ వాడుకుంటోందని మండిపడ్డారు. ‘‘ఆరుగురు ఉగ్రవాదులు హైదరాబాద్లో పట్టుబడ్డారు. ఐఎస్ఐ లాంటి సంస్థలకు పాత బస్తీలో షెల్టర్ ఇస్తున్నారు. అధికారం కాపాడుకోవాలనే ధ్యాస తప్ప, దేశ భద్రతపై బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు. అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకైక లక్ష్యం అధికారం మాత్రమే. ఉగ్రవాదుల కదలికలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలి. శాంతి భద్రతలపై ఒక్క సమీక్ష కూడా కేసీఆర్ చేయట్లేదు. హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ హింసించే పులకేసి అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్ పైన సర్జికల్ స్టైక్ చేస్తే చాలా మంది ఓవర్గా మాట్లాడారని అన్నారు. వారిలో ట్విటర్ టిల్లు కూడా ఉన్నారని అన్నారు. ఆ అన్ని వ్యాఖ్యలు ఓట్ల కోసమే చేశారని ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని ప్రజల ప్రాణాలు బాంబుల మీదున్నాయని.. హైదరాబాద్ ప్రజల భద్రతను బీఆర్ఎస్ గాలికి వదిలేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందనిబండి సంజయ్ వ్యాఖ్యానించారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ను కేసీఆర్ సలహాదారుగా తీసుకోవడం గురించి మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని సీఎం కేసీఆర్ సలహాదారుగా తీసుకున్నారని అన్నారు. పంచాయతీ సెక్రటరీలను ప్రభుత్వం బెదిరిస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.