- నిద్ర మత్తులో అధికారులు
- కనీసం పట్టించుకోని నాయకులు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన తండాల ప్రజలు
- సారూ జర ఈ రోడ్డు గురించి పట్టించుకోరూ..!
మఠంపల్లి : సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం లోని క్రిష్ణ తండా స్టేజి నుండి రామచంద్రాపురం మీదుగా నాగార్జున సిమెంట్ ఫాక్టరీ వరకు ఉన్న రోడ్డు మరీ దారుణంగా తయారయింది దాదాపు 15 సంవత్సరముల క్రితం వేసిన రోడ్డు. కనీసం ఇప్పటి వరకు ఆ రోడ్డు గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. సుమారు 4-5 గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డు మీదుగా ప్రయాణము చేస్తూ ఉంటారు. రోడ్డు ఎంత గుంతల మయం అయినా కనీసం పట్టించుకోరు. పేరుకి మండలానికి చెందిన పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న నాయకులు ఇదే ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. మరి ఆ పదవుల్లో ఉన్న నాయకులు ఈ రోడ్డు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అని, గిరిజన ప్రాంతాల ప్రజలంటే అంత చిన్న చూపా అని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఆ నాయకులను, అధికారులను విమర్శిస్తున్నారు. గ్రామాలలో ఛోటా, మోటా నాయకులేమో మా లీడర్ గొప్ప అంటే మా లీడర్ గొప్ప అని వారి భజనలు చేస్తారు. కానీ ఈ రోడ్డు గురించి మాత్రం పట్టించుకోరు. ఆ గుంతలు ఉన్న రోడ్డు మీద వాహనాలు కానీ ప్రజలు కానీ ప్రమాదాలకు గురైతే అప్పుడు ఎక్కడా లేని మానవత్వం బయటకు వస్తుంది. అదే ముందే జాగ్రత్త పడి రోడ్డు వేస్తే ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు. ఇకనైనా స్థానిక నాయకులు, అధికారులు వెంటనే స్పందించి చుట్టు పక్కల ఉన్న గ్రామాల గిరిజన ప్రజలు ఈ రోడ్డు మీద ప్రమాదాలకు గురికాకుండా వెంటనే క్రిష్ణ తండా స్టేజి నుండి రామచంద్రాపురం మీదుగా నాగార్జున సిమెంట్ ఫాక్టరీ వరకు ఉన్న రోడ్డు వేయాలని గిరిజన గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.