Friday, May 3, 2024

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఏమి జరుగుతోంది..?

తప్పక చదవండి
  • ధరణి పోర్టల్ తో ఆగమాగమౌతున్న రైతన్నలు..
  • భూ యజమాని రికార్డులన్నీ సక్రమంగా ఉన్నా
    పేర్లు మారిపోతున్నాయి..
  • ఎవరిచేతివాటంతో ఈ తతంగం జరుగుతోంది..?
  • సాంకేతిక లోపలా..? లంచాల ప్రభావాలా..?
  • ధరణి మహా గొప్పది అని చెప్పిన సీఎం ఇప్పుడేమంటారు..?
  • లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న
    కొందరు అధికారులు..
  • పొజిషన్ లో లేని వారికి ఆర్.డీ.ఓ. ఓ.ఆర్.సి. ఎలా ఇచ్చాడు..?
  • డబ్బులిస్తే ఎవరికైనా ఓ.ఆర్.సి. వస్తుందా..?

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా సామాన్య ప్రజానీకానికి సరైన పరిపాలనా సౌకర్యాలు లభిస్తున్నాయా అంటే సమాధానం దొరకడం కష్టతరమే అవుతుంది.. ముఖ్యంగా ధరణి పోర్టల్ వచ్చాక ఒక్క రంగారెడ్డి జిల్లా పరిధిలోనే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కడగండ్లు తప్పడం లేదు.. తమ సమస్యలు పరిష్కారం కాకుండా.. మనోవ్యథకు గురౌతున్న రైతాంగం ఎక్కని గడప లేదు.. కలవని అధికారులు లేరు.. చివరకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ.. ఇటు సమయంతో పాటు అటు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుండటం శోచనీయం.. తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పరిథిలో ధరణి బారిన పడి అష్టకష్టాలు పడుతున్న రైతుల దయనీయ గాథ వెలుగు చూసింది.. పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం..

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వరికుప్పల ఈదమ్మ భర్త ఎల్లయ్య అనే ఒక మహిళా రైతు తనకు జరిగిన అన్యాయం గురించి ‘ఆదాబ్ హైదరాబాద్’ తో ఏకరువు పెట్టుకున్నారు.. 1975లో తన మామగారైన వడ్డే వెంకయ్య.. సప్పిడి లింగయ్య దగ్గర భూమిని కొనుగోలు చేయడం జరిగింది.. ఆతరువాత ఆ భూమిని తన భర్త పేరుమీద మార్పు చేసుకున్నామని దానికి సంబంధించిన అప్పటి రెవెన్యూ డిపార్ట్మెంట్ జారీ చేరిన పాత పాస్ పుస్తకాలు ఉన్నాయని.. ఆ తరువాత కాలగమనములో తన భర్త కాలం చేయడంతో ఆ భూమి తన పేరుమీద విలాసత్ అయ్యాయని తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి జారీ అయిన పాస్ బుక్స్ కూడా ఉన్నాయని తెలిపారు.. ఖాతా నెంబర్ : 60348.. టి.ఎస్. పాస్ బుక్ నెంబర్ : టి 05160190774 కూడా జారీ అయినట్లు తెలిపారు.. ఆ తరువాత భూమిని తమకు అమ్మిన వ్యక్తి కుమారుడు సప్పిడి లక్ష్మయ్య తండ్రి లింగయ్య ఎంటర్ అయ్యి తనకు వ్యతిరేకంగా ఓ.ఆర్.సి. తెచ్చుకోవడం జరిగిందని.. దీనితో తాను జాయింట్ కలెక్టర్ ఫెసీ లో అప్పీల్ వేసినట్లు తెలిపారు.. ( ఫైల్ నెంబర్ : ఎఫ్ 1/939/2003 ).. ఆ కేసు ఇప్పటికీ జేసీ దగ్గర పెండింగ్ లో వున్నదని తెలిపారు.. కాగా థర్డ్ పార్టీకి సంబంధించిన వారు ఓ.ఆర్.సి./1511/2022 పై హై కోర్టులో ఛాలెంజ్ చేసి డబ్ల్యు.పీ./11793/2023 ని సస్పెండ్ చేయించడం జరిగింది.. కాగా తమ పేరుమీద రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, కొంగరకుర్దు ఏ గ్రామంలోని సర్వే నెంబర్ : 286/3, 286/4/2 లావణ్య పట్టా పాస్ బుక్స్ తమ పేరు మీద ఉన్నాయని.. జేసీలో కేసు పెండింగ్ లో ఉండగానే రెవెన్యూ రికార్డ్స్ ని కొందరు అధికారులు మార్పు చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. కాగా ఖాతా నెంబర్ : 60348, పాస్ బుక్ నెంబర్ : టి 05160190774 తమ పేరుమీదే ఉన్నాయని.. అయితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. సప్పిడి లక్ష్మయ్య తండ్రి లింగయ్య అనే వ్యక్తి పేరుమీద మార్చారని తెలిపారు.. లావణ్య పట్టాను పట్టా భూమిగా మార్చడం జరిగిందని తెలిపారు.. ఖాతా నెంబర్ : 60348, టి.ఎస్. పాస్ బుక్ నెంబర్ : టి 160190774 కూడా తమపేరు మీదే ఉన్నాయని తెలిపారు.. మరి యజమాని పేరు మార్పిడి ఏ విధంగా జరిగిందో అర్ధం కావడం లేదని ఆమె వాపోయారు.. మరి ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్ కు తెలిసి జరిగిందా..? తెలియకుండా జరిగిందా..? అన్నది అర్ధం కావడం లేదని.. ఒకవేళ కలెక్టర్ కి తెలియకుండా జరిగినట్లయితే జరిగిన తప్పిదాన్ని ఎందుకు ఆయన సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదని ఆమె ప్రశ్నించారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిలో ఎలాంటి తప్పిదాలు జరుగబోవని ఖరాకండిగా చెబుతున్నప్పటికీ.. రికార్డ్స్ లో తమ పేరుకు బదులు వేరేవారి పేరు ఏవిధంగా ఎంటర్ అయ్యిందో..? తెలపాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని ఆమె డిమాండ్ చేశారు.. కాగా 1975 నుంచి 2023 వరకు కూడా తామే భూమిలో హక్కుదారులుగా ఉన్నామని.. అదే విధంగా ఆర్.డీ.ఓ. జారీ చేసిన ఓ.ఆర్.సి. ని కూడా హై కోర్టు సస్పెండ్ చేసింది కనుక.. న్యాయంగా తమపేరు స్థానంలో వేరే వ్యక్తుల పేరు నమోదు కావడం అన్యాయమని వారు అంటున్నారు.. దీని వెనుక జిల్లా కలెక్టర్, ఆర్.డీ.ఓ., ఎమ్మార్వోల హస్తం ఉందని బాధిత మహిళా రైతు ఆరోపిస్తున్నారు.. అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను సైతం ధిక్కరించి తమకు అన్యాయం చేశారని బాధితురాలు కన్నీటిపర్యంతం అవుతున్నారు.. ఇదే విషయమై తాము జిల్లా కలెక్టర్ ని కూడా కలిసి రెఫరెండం ఇచ్చామని ఆమె తెలిపారు..

- Advertisement -

అయితే సంబంధిత భూమిలో పొజిషన్ లో లేకున్నా వేరే వ్యక్తులకు ఓ.ఆర్.సి. ఎలా ఇచ్చారు..? ఈ వ్యవహారం వెనుక ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి..? మరి ఓ.ఆర్.సి. జారీ చేసే ముందు ధరణి పోర్టల్ లో అన్ని వివరాలు క్షుణ్ణంగా వెరిఫై చేయాల్సిన బాధ్యత అధికారులకు లేదా..? సంబంధిత భూమిలో ఎవరు పొజిషన్ లో ఉన్నారో కూడా చూడకుండా ఆర్.డీ.ఓ. .. ఓ.ఆర్.సి. ఎలా ఇచ్చారు..? 1975 నుంచి రైతులు పొజిషన్ లో ఉంటూ పాత పాసు పుస్తకాలు, కొత్త పాసు పుస్తకాలు కలిగి ఉండి, ధరణిలో రికార్డు కూడా ఉండి, రైతు బంధు కూడా తీసుకున్న తరువాత కూడా.. పొజిషన్ లో ఉన్న వరికుప్పల ఈదమ్మను కాదని, ఎలాంటి రికార్డులు లేని ఇతర రైతులకు ఓ.ఆర్.సి. ఎలా ఇచ్చారు..? సాధారణంగా ఏదైనా సమస్య ఉందని ధరణి పోర్టల్ లో దరఖాస్తు చేసుకుంటే.. జిల్లా కలెక్టర్ కు లాగిన్ అవుతుంది.. దానిని పరిశీలించిన కలెక్టర్ సి.సి.ఎల్. కు రెఫర్ చేస్తాడు.. అక్కడి నుండి జాయింట్ కలెక్టర్, ఆ తరువాత ఎమ్మార్వో కు ఆ సమస్య వస్తుంది.. ఇంత తతంగం జరగాల్సి ఉన్నా .. వీటన్నిటినీ తోసిపుచ్చి దొంగ ఓ.ఆర్.సి. ఏ విధంగా ఇచ్చారు.. కొందరు అవినీతి అధికారులు ఆన్ లైన్ లో తమకు నచ్చిన విధంగా మార్పులు, చేర్పులు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారని అర్ధం అవుతోంది..

కాగా దొంగతనంగా తెచ్చుకున్న ఓ.ఆర్.సి. పై రైతులు హై కోర్టుకు వెళ్లి సస్పెన్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది.. ఇదే ఓ.ఆర్.సి. ని రైతులు సవాల్ చేస్తూ.. జేసీ లో అప్పీల్ చేసుకున్నారు.. ఇదే ఓ.ఆర్.సి. పై వరికుప్పల ఈదమ్మ, తేపర్ల సత్తెమ్మ అనే రైతులు కేసు వేయగా.. కేసు జేసీలో నడుస్తుండగానే పొజిషన్ లో ఉన్న రైతుల పేర్లు ఏవిధంగా మారాయి..? బాధిత రైతులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు, మహేశ్వరం ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు జరుగక పోవడానికి వెనుక గల కారణాలు ఏమిటి..? ఎన్ని కోట్ల రూపాయలు ఎవరెవరి చేతులు మారాయో..? తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

ధరణిని అడ్డం పెట్టుకుని భూ యజమానుల పేర్లను సైతం మార్చుతూ.. తమతో లోపాయికారి ఒప్పొందం చేసుకున్న వారికి లబ్ది కలిగేలా రికార్డులను తారుమారు చేస్తున్న మహేశ్వరం మండలం ఎమ్మార్వో మహమూద్ ఆలీ వ్యవహారం క్షమించరానిదని బాధితులు అంటున్నారు.. ధరణిలోని లోపాలను ఆధారంగా చేసుకుని తమ ఇష్టానుసారం విధులు నిర్వహిస్తున్న ఇలాంటి అధికారులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.. దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి జరిగిన వ్యవహారంపై సీరియస్ యాక్షన్ తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత మహిళా రైతులు డిమాండ్ చేస్తున్నారు.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పరిధిలో జరుగుతుతున్న అవినీతి వ్యవహారాలపై మరిన్ని కథనాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు