Saturday, May 18, 2024

నిద్రాణస్థితిలో విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు

తప్పక చదవండి
  • చంద్రయాన్‌-3 ప్రాజెక్టు కథ ముగిసినట్లే
  • ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న నమ్మకం లేదు
  • ఇస్రో మాజీ ఛైర్మన్‌ కీలక వ్యాఖ్యలు

న్యూ ఢిల్లీ : చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుమోపిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు నిద్రాణస్థితిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాటిని మేలుకొల్పేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ కూడా ఎలాంటి సిగ్నల్స్‌ రాలేవు. వాస్తవానికి సెప్టెంబర్‌ 22న చంద్రుడిపై సూర్యోదయం అయింది. కానీ ల్యాండర్‌, రోవర్‌లు నిద్రాణస్థితిలో నుంచి ఇంకా మేల్కొవడం లేదు. ఫలితం కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ చంద్రయాన్‌-3 ప్రాజెక్టుపై తన స్పందనను తెలియజేశారు. ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌లు మేల్కొవడంపై ఇక ఆశలు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌ ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టు ఇక ముగిసిపోయినట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారు. జాబిల్లిపై అడుగుపెట్టిన ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న నమ్మకం లేదని అన్నారు. ఒక వేళ అవి మేల్కోవాల్సి వచ్చినట్లైతే ఇప్పటికే ఆ పని జరిగి ఉండేదని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అవి నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని కిరణ్‌ కుమార్‌ చెప్పారు. అలాగే చంద్రయాన్‌-3 ప్రాజెక్టును విశాల దృక్కోణంలో చూసినప్పుడు ఇప్పటికే అనుకున్న ఫలితం వచ్చేసిందని అన్నారు. అలాగే ఏ దేశానికి కూడా సాధ్యం కాని రీతిలో దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌ అడుగుపెట్టిందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే జాబిల్లి నుంచి విలువైన సమాచారం మనకు అందిందని.. ఇది కచ్చితంగా ఉపయోగపడే సమాచారమని పేర్కొన్నారు. అలాగే ఆ తర్వాత చేపట్టే ప్రాజెక్టుల్లో విజ్ఞానపరంగా, ప్లానింగ్‌ పరంగా చూసుకున్నట్లైతే ఆ ప్రాంతానికి సంబంధించి సేకరించినటువంటి సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అంతేకాదు చంద్రుడి నుంచి నమూనాలను తీసుకువచ్చే అవకాశాలపై కిరణ్‌ తన స్పందనను తెలియజేశారు. అయితే భవిష్యత్తులో అలా తీసుకురావడం సాధ్యం కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. సాంకేతికపరంగా సామర్థ్యాలు పెరగడంతోనే చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ విజయవంతంగా జరిగిందని అన్నారు. అలాగే భవిష్యత్తులో జాబిల్లి నుంచి నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకొచ్చే ప్రాజెక్టులు కూడా కచ్చితంగా ఉంటాయని పేర్కొన్నారు. సాంకేతిక అభివృద్ధి ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశాలు ఉంటాయని వెల్లడిరచారు. ఇదిలా ఉండగా.. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినటువంటి చంద్రయాన్‌-3 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌లు 14 రోజుల పాటు చంద్రుడి గురించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి ఇస్రోకు పంపించాయి. ఆ తర్వాత చంద్రుడిపై రాత్రి కావడం వల్ల సెప్టెంబర్‌ 2న రోవర్‌, 4న ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు నిద్రాణస్థితిలోకి తీసుకెళ్లారు. 14 రోజుల అనంతరం సెప్టెంబర్‌ 22న అక్కడ సూర్యోదయం కాగా.. ఇస్త్రో శాస్త్రవేత్తలు వాటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్‌ చేసి నిద్రాణస్థితి నుంచి మేల్కొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు