- కాళేశ్వరం అవినీతికి అంతులేదు..
- మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి వారే కారణం..
- సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో విచారణ చేయించాలి..
- ఆదివారం ఢిల్లీలో మీడియాతో విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి..
న్యూ ఢిల్లీ : కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణం. నాణ్యత లోపం వల్ల మేడిగడ్డ ప్రమాదం జరిగింది. లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో దర్యాప్తు జరపాలి. కేంద్ర హోంమంత్రి, గవర్నర్ , ఎన్నికల కమిషన్ మేడిగడ్డపై విచారణకి ఆదేశించాలి. మేడిగడ్డకు వెళ్లేందుకి ఈసీకి లేఖ రాస్తాం. మంత్రులు కేటీఆర్, హరీష్రావు మాతో కలిసి మేడిగడ్డకు రావాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కిషన్రెడ్డి మేడిగడ్డలో పర్యటించాలి.ప్రైవేట్ కంపెనీలు నిర్మించాయని మాకు సంబంధం లేదని ప్రభుత్వం అనడం సరికాదు. సంఘవిద్రోహక శక్తులు ఉన్నాయా, మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందా దర్యాప్తు జరిపించాలి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ.. మరి కేసీఆర్పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు’’ అని రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.