బోధన్ : ఇంకుడు గుంతల బిల్లు చేయమంటే స్థానిక ఎపివో లక్ష రూపాయల లంచం అడుగుతున్నాడని, ఇవ్వనందుకు మూడు సంవత్సరాలుగా ఇబ్బందులకు గురిచేస్తు న్నాడని ఓకాంట్రాక్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పురుగుల మందుతో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట్ మండలం కోస్లి గ్రామ పంచాయతీ పరిధిలో 160 ఇంకుడు గుంతలను 2020-21లో నిర్మించడం జరిగిందని వాటికి సంబంధించిన బిల్లు మొత్తం రూ.6,30,000 రావాల్సి ఉందని, అందులో మండల ఉపాధి హామీ ఏపివో రూ.2లక్షల10వేల బిల్లుచేసి 20 వేలు లంచం తీసుకు న్నాడని కాంట్రాక్టర్ శైలందర్ తెలిపారు. మిగతా 4లక్షల 20వేల బిల్లు చేసేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తూ చెల్లించని యెడల బిల్లు చేయనని గత రెండు సంవత్సరాల నుంచి బిల్లు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని కాంట్రాక్టర్ శైలేందర్ ఆరోపించారు. కాంట్రాక్టర్ శైలేందర్ తో పాటు కుటుంబ సభ్యుల ఆత్మహత్యయత్నాన్ని స్థానికులు నిలువరించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు తెలుపుతామని స్థానిక ఎంపీడీవో సాజీద్ అలీ తెలిపారు.