ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాని ఎవరైనా.. వాళ్లు కచ్చితంగా భార్యతో ఉండాలని ఆయన అన్నారు. భార్య లేకుండా ప్రధాని కార్యాలయంలో నివాసం చేయడం సరికాదు అని ఆయన తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా ఈ నియమాన్ని తప్పవద్దు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు అన్నీ ఏకం అయిన విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షానికి ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో మీడియా లాలూను ప్రశ్నించింది. దానికి స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్ష సమావేశం సమయంలోనూ రాహుల్ గాంధీని పెళ్లి గురించి లాలూ అడిగిన విషయం తెలిసిందే. విపక్ష నేతల భేటీలో రాహుల్ను దగ్గరకు పిలిచి మరీ లాలూ అతని పెళ్లి గురించి ప్రశ్నించారు. ప్రధాని కావాలనుకున్న అభ్యర్థి ఎవరైనా.. భార్యతోనే ప్రధాని కార్యాలయంలో ఉండాలని లాలూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అయితే రాబోయే ఎన్నికల్లో విపక్ష కూటమి కనీసం 300 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆర్జేడీ నేత అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ప్రధాని మోదీ తన టీనేజీలోనే పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లాడిన కొన్ని రోజులకే ఆయన భార్య యశోదబెన్ను దూరం పెట్టారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఒంటరిగానే ఉంటున్న విషయం తెలిసిందే.