- ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు సంబందించిన మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. దుబాయ్లోని కోకాకోలా అరేనా వేదికగా మరికొద్దిసేపట్లో ఈ వేలం ఆరంభం కానుంది. దేశ, విదేశీ ఆటగాళ్లు మొత్తంగా 330 మంది ఈ వేలంలో పాల్గొననున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్ల కోసం పోటీపడనున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు ఉన్నాయి. వేలం ఆరంభంకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ హెడ్ కోచ్ టామ్ మూడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ను ఎవరూ కొనుగోలు చేయరని టామ్ మూడీ జోస్యం చెప్పాడు. మూడీ చెప్పినట్లే ఈ వేలంలో స్మిత్ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో స్మిత్ పెద్దగా రాణించడం లేదు. వన్డే ప్రపంచకప్ 2023లో కూడా అతడు విఫలమయ్యాడు. అందులోనూ ధాటిగా కూడా బ్యాటింగ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే స్మిత్ను ఎవరూ కొనుగోలు చేయరని మూడీ అన్నాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచిల్ స్టార్క్ భారీ ధరకు అమ్ముడుపోతాడని టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. సామ్ కర్రన్ (రూ. 18.50 కోట్లు) నెలకొల్పిన ఆల్-టైమ్ వేలం రికార్డును స్టార్క్ బద్దలు కొడతాడని తెలిపాడు. స్టార్క్ రూ. 20 కోట్లకు అమ్ముడుపోయిన ఆశ్చర్యపోన్కర్లేదన్నాడు. భారత దేశవాళీ క్రికెటర్ షారుక్ ఖాన్ భారీ ధరకు అమ్ముడుపోతాడని మూడీ జోస్యం చెప్పాడు. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ వంటి ఆస్ట్రేలియా స్టార్లు కూడా వేలంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.