- ఎద్దేవా చేసిన రాష్ట్ర మంత్రి కేటీఆర్..
- మందమర్రిలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి..
- రూ. 250 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభం..
హైదరాబాద్ : 60 ఏళ్లల్లో ఏమీ చేయని కాంగ్రెస్.. ఇప్పుడు ఆరు గ్యారంటీలు అంటూ వస్తోందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రిలో నిర్వహించిన రోడ్డు షో, సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.250 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్యారంటీలను ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు జనాలు వినే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. 150 సంవత్సరాల కిందటనే పుట్టిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే ఐదేళ్లకు ఐదుగురు ముఖ్యమంత్రులు అవుతారని, ఎవరు సీఎంగా ఉండాలన్నది ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలే చెబుతారని అన్నారు. సింగరేణి కార్మిక వాడల్లో పర్యటిస్తూ, మిషన్ భగీరథ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం మందమర్రి మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. రూ.250 కోట్ల వ్యయంతో మందమర్రి, క్యాతన్ పల్లి మున్సిపాలిటిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి ప్రారంభించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.మరో వైపు బాల్క సుమన్ ఓయూ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.