Friday, April 26, 2024

మంత్రి గంగులకు తృటిలో తప్పిన ప్రమాదం..

తప్పక చదవండి

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగులకు తృటిలో ప్రమాదం తప్పింది. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తాజాగా చెరువుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్‌నగర్ ఊర చెరువు వద్ద జరిగిన చెరువుల పండుగలో గంగుల పాల్గొన్నారు. ఈ సమయంలో నాటు పడవ ఎక్కాలని గంగులను బీఆర్ఎస్ కార్యకర్తలు కోరారు. దీంతో గంగుల నాటు పడవ ఎక్కేందుకు ఆసక్తి చూపారు. అయితే గంగుల ఎక్కుతుండగా నాటు పడవ ఒకవైపునకు ఒరిగిపోయి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో గంగుల పట్టు కోల్పోయి నీళ్లల్లో పడ్డారు. వెంటనే అప్రమత్తమైన గంగుల సెక్యూరిటీ సిబ్బంది.. నీళ్లల్లోకి దిగి ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రమాదం నుంచి తేరుకొని కాసేపటికి మిగతా కార్యక్రమాల్లో గుంగుల పాల్గొన్నారు. గంగుల సురక్షితంగా బయటపడటంతో.. అధికారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 21 రోజుల పాటు అవతరణ ఉత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఒక్కొ రోజు ఒక్కో ప్రత్యేకత ఉండేలా ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పుల గురించి ప్రజలకు తెలియజేసేలా అభివృద్ధికి సంబంధించి రోజుకో అంశంపై అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. జూన్ 2న ఉత్సవాలను కేసీఆర్ కొత్త సెక్రటేరియట్‌లో ప్రారంభించారు. 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనుండగా.. చివరి రోజు ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొని ముగింపు ప్రసంగం ఇవ్వనున్నారు.

ఉత్సవాల ప్రారంభం రోజు ఇచ్చిన ప్రసంగంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కేసీఆర్ వివరించారు. రాష్ట్రం ఏర్పడకముందు పరిస్థితి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి చెందిన విధానం గురించి మాట్లాడారు. తెలంగాణను తమ ప్రభుత్వంలో అద్భుతంగా తీర్చిదిద్దినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడకముందు కరెంట్ కోతలు ఉండేవని, ఇప్పుడు కరెంట్ సమస్య పరిష్కారమైందని చెప్పారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేసి పోలాలకు నీళ్లు అందిస్తామని, ఉద్యోగాలు కూడా పెద్ద సంఖ్యలో ఇస్తున్నట్లు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు