- కాంగ్రెస్కు టీజేఎస్ మద్దతు..
- కీలక కండీషన్లు పెట్టిన కోదండరాం..!
- తెలంగాణకు పట్టిన చీడపీడ వదలాలి
- కోదండరామ్ సహకారం అవసరం
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
- టీజేఎస్ కార్యాలయంలో కోదండరాంతో భేటీ
హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల్లో విజయ పతాకం ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికల వ్యవధి సరిగా నెల రోజులు ఉండేసరికి.. చేరికలను ఆహ్వానిస్తూ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు ఎక్కువనే చెప్పవచ్చు. నిన్నటి వరకు వామపక్షాలతో.. తాజాగా టీజేఎస్ పార్టీతో పొత్తులు పర్వాన్ని సాగిస్తోంది. అందినకాడికి సమన్వయం చేసుకుంటూ.. ముందుకు సాగుతోంది. ఎన్నికల బరిలో అభ్యర్థుల ప్రకటనలో ఒక మెట్టు తక్కువగా ఉన్న కాంగ్రెస్.. అభ్యర్థుల చేరికలు, పార్టీ పొత్తుల విషయంలో మాత్రం దూకుడుగా ఉందనే చెప్పవచ్చు. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ ఇతర పార్టీలతో మంతనాలు జరుపుతూ.. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు అన్ని పార్టీల మద్దతు కూడబెడుతు ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే.. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో కోదండరాంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాణిక రావు ఠాక్రేతో పాటు కర్ణాటక మంత్రి బోసురాజు భేటీ అయ్యారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సిందిగా కోదండరాంను కోరారు. దీంతో.. కాంగ్రెస్తో కలిసి పని చేసేందుకు కోదండరాం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కాగా.. ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్ధుబాటు అంశాల మీద నేతలు సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే.. కోదండరాం కీలక కండీషన్లు పెట్టినట్టు తెలుస్తోంది. కోదండరాం పెట్టిన పలు కండీషన్లకు కాంగ్రెస్ నేతలు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీజేఎస్కు సముచిత స్థానం ఇస్తామని కూడా మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో.. ఈ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్, టీజేఎస్ ఓ అంగీకారానికి వచ్చాయి. పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తున్న.. ప్రజా వ్యతిరేక విధానాలపై కోదండరాం ఉద్యమిస్తూనే ఉన్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధిష్ఠానం సూచన మేరకు.. కోదండరాం మద్దతు కోరేందుకు వచ్చినట్టు తెలిపారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కాంగ్రెస్ పార్టీకి కోదండరాం సహకారం కూడా అవసరమని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీజేఎస్తో కలిసి ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్నికల క్షేత్రంలోనే కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ టీజేఎస్కు కీలక స్థానం ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లక్ష్యం గొప్పదని.. అందుకోసం కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటామని కోదండరాం హామీ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.