Thursday, May 2, 2024

సాగర్‌ డ్యామ్‌ పై ఏపీ హైడ్రామా..రాజకీయ లబ్ధికోసం..!

తప్పక చదవండి
  • పెదవి విప్పని కేంద్ర ప్రభుత్వం…
  • చర్యలు తీసుకోని కృష్ణా రివర్‌ బోర్డు…!!
  • పూర్తి విచారణ జరిపి…సాగర్‌ జలాలను కాపాడాలి….!
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి

మిర్యాలగూడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిబంధనలకు విరు ద్ధంగా, భారీగా పోలీసుల అండతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద హైడ్రామా చేసి నీటిని అక్రమంగా తరలించకపోవడం ప్రాంతీయ వివాదాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా పోలీసులను ఉసిగొలిపిన ఏపీ సర్కార్‌ 13వ గేటు వద్ద తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోలీసులను దౌర్జన్యంగా వెళ్లగొట్టి, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ముళ్లకంచలు గేట్లతో మూడంచెల అడ్డంకులు సృష్టించి హైడ్రామా చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా కుడికాలువ గేట్లు ఎత్తి నీటిని అక్రమంగా తరలించకపోతున్నారని ఆరోపించారు. జీవో నెంబర్‌ 69 ని అనుసరించి ఏ రాష్ట్రానికి ఎంత వాటా దక్కాలని స్పష్టంగా ఉందని కానీ నిబంధనలు తుంగలో తొక్కి పోలీసుల అండతో అక్రమంగా నీటిని తరలించకపోవడం అక్రమమన్నారు. 510 అడుగుల స్టోరేజీ ఉన్న సాగర్‌ డ్యాం నుండి నీటిని తరలించకపోతే ప్రాజెక్ట్‌ డెడ్‌ స్టోరేజ్‌ కి చేరుకుని పరిస్థితి వస్తుందని అన్నారు. గత కొద్ది రోజులుగా ఇంత హై డ్రామా జరుగుతున్నప్పటికీ ఇటు కేంద్ర ప్రభుత్వంగానీ, అటు కృష్ణా రివర్‌ బోర్డు గానీ స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ఏపీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసమే కేంద్ర, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న కుట్రని అన్నారు.ప్రజలమధ్య వివాదాలు రెచ్చగొట్టే ఈ చర్యను ఖండిస్తున్నామన్నారు. పూర్తి విచారణ జరిపి నిజానిజాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. వర్షా బావ పరిస్థితులు, రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సాగర్‌ జలాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డబ్బికార్‌ మల్లేష్‌, డాక్టర్‌ మల్లు గౌతమ్‌ రెడ్డి,వీరేపల్లి వెంకటేశ్వర్లు, పతాని శీను, రామ్మూర్తి, జగదీష్‌ చంద్ర, రాగిరెడ్డి మంగారెడ్డి, గాదె పద్మ, రేమిడాల పరుశురాములు, వినోద్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు