ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రకటించారు. ప్రమాదం గురించి తెలియగానే గుండె పగిలినంత పనైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ తెలిపారు. ఈ ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన, గాయపడిన బాధితులకు ధైర్యం అందించాలని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు వైట్ హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
కుటుంబ, సాంస్కృతిక విలువల్లో ఉన్న మూలాలే భారత్, అమెరికా దేశాలను ఏకం చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అభిప్రాయపడ్డారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయుల వెంట యావత్ అమెరికా ఉందని తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వాళ్లు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.