- జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్
- విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని విన్నపం
- ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ప్రశ్నించిన ధర్మాసనం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై ఎంపీ రఘురామ రాజు సుప్రీకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జగన్ కేసులు ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ తో పాటు బెయిల్ రద్దు పిటీషన్ ను జోడించి జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా జగన్, సీబీఐకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.
రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. సాక్ష్యాలు చెరిపేస్తున్నారని ఆనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సందర్భంగా.. కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై వివరాలను రఘురామ రాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ లిఖితపూర్వకంగా కోర్టుకు అందించారు. జగన్కు బెయిల్ మంజూరు చేసిన తర్వాత.. దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే వ్యవహారంలో.. కేసు ట్రయల్ను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని తాము దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ ఉందని, దానిలో ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు కోర్టుకు రఘురమా తరపు న్యాయవాది తెలిపాడు. హైకోర్టులో కేసు కొట్టివేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కూడా ఇటీవల సుప్రీంకోర్టుకు వచ్చినట్లు ధర్మాసనం దృష్టికి బాలాజీ శ్రీనివాసన్ తీసుకెళ్లాడు. ఆ పిటీషన్కూడా ఇదే ధర్మాసనం వద్ద పెండింగ్లో ఉన్నదని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.
రఘురామ తరపు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా?అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టుకు తెలిపాడు. విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలన్న పిటిషన్, ఈడి దాఖలు చేసిన పిటిషన్కు బెయిల్ రద్దు పిటిషన్ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. జగన్, సీబీఐసహా ప్రతివాదులు అందరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోందని పిటిషన్లో రఘురామ పేర్కొన్నాడు. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్న జగన్ ట్రయల్ కోర్టు ముందు హాజరుకాకుండా శాశ్వత మినహాయింపు పొందారని పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు ప్రారంభం అయ్యి పదేళ్లయినా, అభియోగాల నమోదు జరగకపోయినా దర్యాప్తు సంస్థ మౌనంగా ఉంటూ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని పిటిషన్ లో రఘురామ ఆరోపించాడు. అయితే, ఇవే విషయాలను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో రఘురామ పేర్కొన్నప్పటికి కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో రఘురామ పిటీషన్ కొట్టివేసింది.