- పైసల్ కొల్లగొట్టిన మహానుభావులు ఎవరు..?
- అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నజీ.హెచ్.ఎం.సి. ఖైరతాబాద్ జోన్..
- అనుమతులు ఓ తీరు..ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మరో తీరు..
- పైసల్తో పనికానిస్తున్న జీ.హెచ్.ఎం.సి. ఉద్యోగులు..
- జీ.హెచ్.ఎం.సి.కి ఆర్ధికంగా నష్టం కల్గించిన డిప్యూటీ కమిషనర్..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అతిపెద్ద కార్పొరేషన్. జిహెచ్ఎంసికి రెవెన్యూ పరంగా వందల కోట్ల రూపాయలు వివిధ విభాగాల నుండి టాక్స్ ల రూపంలో రావడం జరుగుతుంది. అదే విధంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన నిర్మాణ అనుమతుల కొరకు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందుట కొరకు జిహెచ్ఎంసికి భవన యజమానులు కోట్ల రూపాయలు టాక్స్ ల రూపంలో చెల్లించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించిన కొందరు అధికారులు ఇదే అదనుగా భావించి, అక్రమంగా ఎంతో సులువుగా సొమ్మును వెనకేసుకోవచ్చు అన్న స్వార్థపూరిత ఆలోచనలతో తన సొంత డిపార్ట్మెంట్ ను వదిలి, జిహెచ్ఎంసిలో సంవత్సరాల తరబడి తిష్ట వేసి డిప్యూటేషన్ పై కొనసాగుతున్నారు. జిహెచ్ఎంసిలో కొందరు అధికారులు వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ… చట్టాలను ఉల్లంఘించి స్వార్థ ప్రయోజనాల కోసం నియమ, నిబంధనలకు భే ఖాతరు చేస్తూ.. అక్రమ మార్గాల ద్వారా డబ్బులను ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తున్నారు.
హైదరాబాద్ : ఖైరతాబాద్ జోన్ లో 2021 సంవత్సరంలో డిప్యూటీ కమిషనర్ గా విధులు వెలగబెట్టిన సేవా ఇస్లావత్ అక్రమంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ను జారీ చేశారు. బంజారాహిల్స్ లోని ఓ ప్లాట్ అనుమతులను 2018లో అప్పటి అధికారులు డీపీఎంఎస్ ( డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం. ) ద్వారా అనుమతులు ఇవ్వడం జరిగింది. అనుమతి ప్రకారం భవన నిర్మాణం పూర్తి అయిన అనంతరం భవన యజమాని జిహెచ్ఎంసి నుండి ఆక్యుపెన్సి సర్టిఫికెట్ ను పొందవలసి ఉంటుంది. జిహెచ్ఎంసి నిబంధనల ప్రకారం విస్తీర్ణాన్ని బట్టి టౌన్ ప్లానింగ్ అధికారులు వివిధ స్థాయిలలో అనుమతులు ఇవ్వడం జరుగుతుంది . అదేవిధంగా విస్తీర్ణాన్ని బట్టి ఆకుపెన్సి సర్టిఫికెట్ లను అధికారులు జారీ చేస్తారు. విస్తీర్ణం తక్కువగా ఉన్నట్లయితే డిప్యూటీ కమిషనర్ సైతం జారీ చేయొచ్చు. సర్కిల్ పరిధి కంటే మించి ఎక్కువ విస్తీర్ణం కలిగిన భవనాలకు జోనల్ కార్యాలయం నుండి లేదా జిహెచ్ఎంసి కేంద్ర కార్యాలయం నుండి జారీ చేస్తారు. కాగా జోనల్ కార్యాలయం నుండి జారీ చేయాల్సిన ఆక్యుపెన్సి సర్టిఫికెట్ ను జోనల్ కార్యాలయానికి పోకుండా.. 2018లో ఇచ్చిన అనుమతుల విస్తీర్ణాన్ని తగ్గించి, భవన యజమానితో భారీ ఎత్తున ముడుపులు తీసుకుని, సదరు డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్ అక్రమం గా జారీ చేయడం జరిగింది. అనుమతులు పొందిన ప్రకారం నిర్మించిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేసినట్లయితే డివియేషన్ ప్రకారం లెక్క చేసి, ఆ భవన యజమానికి పెనాల్టీ వేయడం జరుగుతుంది. కానీ అవేవీ ఇక్కడ మచ్చుకైనా కనిపించవు.. బంజారాహిల్స్ లో నిర్మించిన ఒక భవనాన్ని నిర్మించిన భవన యజమాని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినా డిప్యూటీ కమిషనర్ పరిశీలించి, ఎలాంటి పెనాల్టీ లేకుండా.. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆక్యుపెన్సివ్ సర్టిఫికెట్ జారీ చేయడం ఆయన అవినీతికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.. ఈయన గారు ఈ జారీ చేసిన ఈ సర్టిఫికెట్ పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ విషయంపై పూర్తి ఆధారాల కొరకు ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి సంబంధిత ఉన్నత అధికారులను సంప్రదించడం జరిగింది. ఈ విషయాన్ని పరిశీలించి పూర్తి సమాచారాన్ని అందిస్తామని ఆ అధికారి తెలపడం జరిగింది. ఈ విషయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ‘ఆదాబ్ హైదరాబాద్’ పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఈ అవినీతి బాగోతంపై సమగ్రంగా విచారించి, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కాగా సంబంధిత డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్ ని వివరణకు సంప్రదించగా అతను స్పందించకపోవడం గమనార్హం..