- పూటకో పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు ఉండవు
- ఉపఎన్నిక ఫలితమే రిపీట్ కావాలి
- 50 ఏళ్లుగా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించని కాంగ్రెస్
- పదేళ్లలో మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాం
- డబ్బు మదంతో పనిచేసే వాళ్లకు బుద్ధి చెప్పాలి
- 24 గంటల కరెంటు ఇస్తున్నది ఎవరో ప్రజలు గమనించాలి
- కర్ణాటకలో అప్పుడే కరెంటు కష్టాలు మొదలయ్యాయి
- బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ విమర్శలు
- కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసింది
- కొత్తగా చూపాల్సిన అవసరం లేదు
- రైతు బంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్
- రైతుబంధును దశలవారీగా రూ.16 వేలకు పెంచుతాం
- 24 ఏళ్ల క్రితమే ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించా
- అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తాం
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై 109 కేసులు
- ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్కు పేరు వస్తుందనే అడ్డంకులు
- ఎవరు గెలిస్తే.. తెలంగాణ ముందుకు వెళ్తుందో వారినే గెలిపించాలి
- ధరణితో 15 నిమిషాల్లో భూములు రిజిస్ట్రేషన్
- ధరణి రద్దు చేస్తే.. మళ్లీ దళారుల రాజ్యమే
మునుగోడు/అచ్చంపేట : ఈ ఎన్నికల్లో కూడా ఉపఎన్నికల్లో చూపిన చైతన్యాన్ని మునుగోడు ప్రజలు చూపించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కోరారు. పూటకో పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు ఉండవని అన్నారు. నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు. ఆనాడు ఉపఎన్నికలో మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఉపఎన్నికల్లో చూపిన చైతన్యాన్ని.. మునుగోడు ప్రజలు మరోసారి చూపించాలని కోరారు. నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ లో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ పదేళ్లలో ఆ సమస్యను పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నీళ్లు ఇచ్చి రూపుమాపామని గుర్తు చేశారు. డబ్బు మదంతో పనిచేసే వాళ్లకు బుద్ధి చెప్పాలని కోరారు. 24 గంటల కరెంటు ఇస్తున్నది.. ఎవరో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఆఖరికీ ప్రధాని రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేదన్నారు. చివరికీ ఈ ఏడాదే అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో అప్పుడే కరెంటు కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఆనాడు ఎన్నికల్లో కాంగ్రెస్.. 20 గంటల కరెంటు ఇస్తామని అక్కడి ప్రజలను మోసం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఐదు గంటలే విద్యుత్ ఇస్తున్నారు. ఇవాళ కర్ణాటక రైతులు వచ్చి గద్వాల, కొడంగల్లో ధర్నాలు చేస్తున్నారన్నారు. బీజేపీ వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను తీసుకువచ్చి.. ఇక్కడ దించుతుంది.. అక్కడ వారికే దిక్కులేదు కానీ ఇక్కడకు వస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో 3 కోట్ల టన్నుల వరి పండుతోందని సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే శివన్నగూడెం ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయని చెప్పారు. అదే జరిగితే మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ఈసారి ఎన్నికలో కూడా ఉపఎన్నికలో చూపిన చైతన్యాన్ని మునుగోడు ప్రజలు మరోసారి చూపించాలని కోరారు. చైతన్యవంతులైన నల్గొండ ప్రజలు ధన బేహార్లను తరిమి కొట్టాలని ఈ సందర్భంగా కోరారు. రైతు బంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్.. ఈసారి రైతుబంధును దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందని.. కొత్తగా చూపాల్సిన అవసరం లేదని తెలిపారు. మహబూబ్నగర్లోని అచ్చంపేట నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందని.. కొత్తగా చూపాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలిస్తేనే.. అందరి జీవితాలు బాగుపడతాయని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రయాణం పదో సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయని.. కానీ అంతకంటే ముందే 24 ఏళ్ల క్రితమే తాను ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో తెలియదన్నారు. ఇప్పుడు తెలంగాణ కోసం తన పోరాటం అయిపోయిందని.. ఇక చేయాల్సింది ప్రజలేనని హితవు పలికారు. ‘‘కొందరు నాయకులు కొడంగల్కు రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని సవాల్ విసురుతున్నారు. రైతుబంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్. రైతుబంధును దశలవారీగా రూ.16 వేలకు పెంచుతాం. అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ నేతలు 109 కేసులు వేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్కు పేరు వస్తుందనే కేసులు వేసి అడ్డుకుంటున్నారు.
ఎవరు గెలిస్తే.. తెలంగాణ ముందుకు వెళ్తుందో వారినే గెలిపించాలి. ఉన్న తెలంగాణను పోగొట్టిందే కాంగ్రెస్. తెలంగాణ ఇస్తామని 2004లో ప్రకటించి.. 2014లో ఇచ్చారు. రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని ధరణి తీసుకువచ్చాము. ధరణి ఉండడం వల్ల రైతు బంధు, ధాన్యం డబ్బులు వేగంగా వస్తున్నాయి. ఎవరి పైరవీలు లేకుండా 15 నిమిషాల్లో భూములు రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ధరణి రద్దు చేస్తే పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. సరిపడా కరెంటు లేక, తాగునీరు, సాగునీరు లేక ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు ముంబయికి వలస పోయినప్పుడు ఎవరైనా వచ్చారా అంటూ ప్రశ్నించారు. కానీ ఇప్పుడు దేశం మొత్తంలో 24 గంటల కరెంటును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సగర్వంగా చెప్పుకున్నారు. అయితే 24 గంటలు రాష్ట్రంలో కరెంటు ఇస్తే.. కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని ఆనాడు జానారెడ్డి సవాల్ విసిరారని గుర్తు చేశారు. 24 గంటల కరెంటు ఇచ్చి చూపించాక వారి సవాల్ ఏమైందని అన్నారు. ఇంటింటికీ నల్లానీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణేనని అన్నారు. 60 లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ.. ఇవాళ 3 కోట్ల టన్నులు పండిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని సీఎం కేసీఆర్ ఆనందించారు. వీటితో కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందని.. కొత్తగా చూపాల్సిన అవసరం ఏమీ లేదన్నారు.