రాంపూర్ : నకిలీ బర్త్ సర్టిఫకేట్ కేసులో సమాజ్వాద్ పార్టీ నేత, మాజీ ఎంపీ ఆజంఖాన్, అతని భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు, మాజీ ఎంఎల్ఏ అబ్దుల్లా ఆజమ్లకు ఎంపీ`ఎంఎల్ఏ కోర్టు బుధవారం ఏడేండ్ల కారాగార శిక్ష విధించింది. కోర్టుకు హాజరైన ముగ్గురినీ ఆ తర్వాత రాంపుర్ జిల్లా కారాగారానికి తరలించారు. రాజకీయ పలుకుబడి ద్వారా అబ్దుల్లా ఆజం పేరిట లఖ్నవూలో ఒకటి, రాంపుర్లో ఒకటి చొప్పున పుట్టినతేదీ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు భాజపా ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా చేసిన ఫిర్యాదు ఆధారంగా 2019లో కేసు నమోదైంది. ఈ పత్రాలు తీసుకునేందుకు ఆజంఖాన్ దంపతులు సహకరించారని ఫిర్యాదిదారుడు పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై? నమోదైన కేసుల విచారణకు ఉద్దేశించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై విచారించి గరిష్ఠ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఒక్కొక్కరికి రూ.50 వేల జరిమానా కూడా విధించింది. ఒక పత్రంలో 1.1.1993 అని, మరో దానిలో 30.9.1990 అని పుట్టినతేదీ ఉన్నట్లు రుజువైంది. ఆజం ఖాన్ మతం దృష్ట్యా ఆయన్ని వేధిస్తున్నారని, ఇది అందరికీ తెలుసునని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. 2017లో తనయుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకే తప్పు డు పత్రాలు తీసుకున్నారని, వాటితోనే ఆయన గెలిచారని ఫిర్యాదిదారు ఆరోపించారు.