అమరావతి : విజయవాడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశించారు. అలాగే ఘటనపై విచారణ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎం జగన్కు అధికారులు వివరాలు అందజేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్ఫాం విూదకు దూసుకుపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదం జరిగిందిలా..
విజయవాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన మెట్రో లగ్జరీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఫ్లాట్ ఫాంపైకి దూసుకువెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో కండెక్టర్, ఒక మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. ప్రమాదంపై పరిశీలిస్తున్నారు.