- పెరుగుతున్న చలితీవ్రత
తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వారు అంచనా వేశారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా రెండ్రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో విూటర్ల వేగంతో తూర్పు, ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 27.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 14.7 డిగ్రీలుగా నమోదైంది. 72 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న భూమధ్య రేఖా ప్రాంతంలోని హిందూ మహాసముద్రం విూద ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో విూటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆంధప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య లేదా తూర్పు గాలులు వీయనున్నట్లు తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో నేడు రేపు, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని.. ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా.. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు.