- శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచుతాం
- ఆదే లక్ష్యంగా భారతదేశం పని చేస్తుంది
- కాప్-28 సదస్సులో ప్రధాని మోడీ
- పలు దేశాధినేతలతో మోడీ మర్యాదపూర్వక భేటీ!
దుబాయి : ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గించడమే భారతదేశ లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్లో శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. 2028లో భారత్లో కాప్-33 సదస్సును నిర్వహించాలని మోడీ ప్రతిపాదించారు. 2028లో భారత్లో కాప్-33 సదస్సును నిర్వహించాలని ప్రతిపాదించారు ప్రధాని నరేంద్ర మోడీ. దుబాయిలో జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సు (కాప్-28 సదస్సు)లో ప్రధాని మోడీ ప్రారంభ ప్రసంగం చేశారు. 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గించడమే భారతదేశ లక్ష్యమని ఆయన తెలిపారు. శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచాలని భారత్ నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు మోడీ. 2070 నాటికి నికర సున్నా లక్ష్యం దిశగా ముందుకు వెళ్తామని ప్రధాని చెప్పారు. వాతావరణ మార్పుల విషయంలో ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్కు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంపన్న దేశాలు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ నేడు ప్రపంచం ముందు జీవావరణ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ మధ్య సమతుల్యతకు అద్భుతమైన ఉదాహరణను అందించింది. ప్రపంచంలోని 17శాతం జనాభాకు భారత్ నిలయంగా ఉన్నప్పటికీ, కర్బన ఉద్గారాల విడుదలలో 4 శాతం కంటే తక్కువగా ఉంది. ఎండీసి లక్ష్యాలను చేరుకునే మార్గంలో ఉన్న ప్రపంచంలోని కొన్ని ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటని అన్నారు. మరోవైపు, ప్రధాని మోడీ అరుదైన గౌరవాన్ని పొందారు. కాప్ 28 సదస్సులో ప్రారంభ ప్రసంగం చేశారు. కాప్ సదస్సు అధ్యక్షుడు సుల్తాన్ అల్ జాబ్, కార్యనిర్వాహక కార్యదర్శి స్టెమన్ స్టెయిల్తో కలిసి ప్రారంభ ప్లీనరీలో పాల్గొన్న ఏకైక దేశాధినేత మోడీనే. ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన ప్రధాని మోడీ.. పలు దేశాల అధినేతలను మర్యాదపూర్వకంగా పలకరించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో మోడీ సంభాషించారు. భారత్- బ్రిటన్ స్నేహం రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతుందని మోడీ ట్వీట్ చేశారు. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాతో మోడీ మాట్లాడారు. బహ్రెయిన్తో బలమైన, శాశ్వతమైన సంబంధాలను భారత్ ఎంతో విలువైనదిగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ అధ్యక్షులతోనూ ప్రధాని సంభాషించారు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్తో మోడీ సమావేశమయ్యారు. అంతకుముందు యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తో సరదాగా మాట్లాడారు. నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్టేతోనూ మోడీ భేటీ అయ్యారు. పలు దేశాధినేతలను పలకరించిన చిత్రాలను ప్రధాని ట్వీట్ చేశారు. కాప్ -28 సమావేశానికి ముందు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఫ్యామిలీ ఫొటో దిగారు. నవంబర్ 30న యూఏఈ అధ్యక్షతన దుబాయిలో ప్రారంభమైన కాప్-28 సమావేశాలు ఈనెల 12వ తేదీ వరకు జరగనున్నాయి.