Sunday, May 19, 2024

పాదయాత్రతో ఎన్నికల సమర శంఖం…

తప్పక చదవండి
  • తొలి రోజు గడపగడపకు నీలం మధుకు అపూర్వ స్వాగతం..
  • మీ కష్టాలు తెలిసిన మీ ఇంటి బిడ్డను…
  • ఆత్మగౌరవ పోరాటంతో మీ ముందుకు వస్తున్న..
  • ఒక్కసారి మీ కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం ఇవ్వండి…
  • అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో చూపిస్తా…
  • మహిపాల్ రెడ్డి గెలిస్తే కుటుంబ పాలన..
  • నేను గెలిస్తే నియోజకవర్గ ప్రజలంతా ఎమ్మెల్యేలే..
  • అహంకారానికి,ఆత్మగౌరవానికి మధ్య పోరులో నా పక్షాన నిలబడండి..
  • మన పాలనలో మన అభివృద్ధి మనమే చేసుకుందాం..
  • వెల్లడించిన నీలం మధు ముదిరాజ్..

ఎన్నికల సంగ్రామంలో తనకు జరిగిన అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకుంటానని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని వెల్లడించిన నీలం మధు ముదిరాజ్ సోమవారం నుంచి పాదయాత్రతో ఎన్నికల సమరశంకాన్ని పూరించారు.

హైదరాబాద్: గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మీ కొడుకు మీ ఇంటి గుమ్మంలో నినాదంతో పాదయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణలో 65 లక్షల మంది జనాభా ఉన్న ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గంలో ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ మా జాతిని తీవ్రంగా అవమానించిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినప్పుడే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.

- Advertisement -

ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ప్రతినిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు నిర్వహించానన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయింపులు తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.
ప్రజల ఆదేశాలు, నన్ను నమ్మి నా వెనుక నడుస్తున్న అనుచరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. పటాన్ చెరు గడ్డ మీద ఈసారి ఎన్నికల్లో ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య పోటీ జరగనుందని వివరించారు. పటాన్ చెరు నియోజకవర్గంలో తాను నిర్వహించిన సేవా కార్యక్రమాలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు తాను చేస్తున్న సేవలను చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అడుగడుగునా తీవ్ర అడ్డంకులకు గురి చేశాడని ఆరోపించారు. కనీసం కిందిస్థాయి కార్యకర్తలకు ప్రజలకు గౌరవం ఇవ్వలేని నాయకుడు మనకు అవసరమా అని ప్రజలను ప్రశ్నించాడు. గత పది ఏళ్లలో ఎమ్మెల్యేకు గుర్తురాని ప్రజలు గత నాలుగేళ్లుగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు తనకొస్తున్న గుర్తింపు చూసి నిద్రలేచి ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. అయితే గత పదేండ్లలో ఎన్నో అవమానాలు, అణిచివేతలు అక్రమాలను చూసిన ప్రజలు, కిందిస్థాయి కార్యకర్తలు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారని తెలిపారు. ప్రజలే దేవులుగా ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా తాను పాదయాత్రకు ప్రజల్లోకి వెళ్తున్ననన్నారు.

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విజయం సాధిస్తే కేవలం ఆయన కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా గౌరవం పొందుతారని, కానీ తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న మూడు లక్షల 80 వేల మందికి ఎమ్మెల్యేలుగా గుర్తింపు తెస్తానన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే ‘గుడ్ మార్నింగ్ పటాన్ చెరు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే సిఎస్ఆర్ నిధులతో పేదవాళ్లకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా, ప్రజలకు కావలసిన ఉచిత విద్య,వైద్యం వంటి సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సిఎస్ఆర్ నిధులను పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నాడని విమర్శలు గుప్పించాడు. జివిఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జిఎంఆర్ ఆ సంస్థకు సంబంధించిన టర్నోవర్ ఆ సంస్థకు వస్తున్న నిధులపై వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణమే నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తి విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం కొత్తపల్లి గ్రామంలో పాదయాత్ర మొదలుపెట్టిన నీలం మధు ముదిరాజ్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. తమ గడపకు వచ్చిన నీలం మధు ను తమ ఇంట్లో బిడ్డగా ఆదరించి తమ కష్టాలను చెప్పుకున్నారు. తమ కుటుంబ సభ్యుడు లాంటి నీలంకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తామండగా నిలబడి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రజలు స్పష్టం చేశారు.
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చేసే అభివృద్ధిని వివరిస్తూ ఐదు హామీలతో పోస్టర్ ను విడుదల చేశారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, పర్యావరణ పరిరక్షణ, స్థానిక పాలనలో ప్రజల భాగస్వామ్యం అనే అంశాలకు ప్రాధాన్యమిస్తానన్నారు. ప్రజలు ఆత్మగౌరవంతో ఆలోచించి మీ కుటుంబ సభ్యుడిగా మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్న నన్ను ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు,ప్రజలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ తో నా బంధం ముగిసింది : నీలం మధు ముదిరాజ్..

బీఆర్ఎస్ అనుబంధానికి నీలం మధు ముదిరాజ్ స్వస్తి పలికారు. సోమవారం గుమ్మడిదల మండలం కొత్తపల్లి వేదికగా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీ పెట్టిన 22 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఒక సైనికుడి లాగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేశానని ఆయన తెలిపారు. 2014లో పటాన్ చెరు జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయడానికి అభ్యర్థులు సైతం లేని సమయంలో పోటీ చేసి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా నా స్వగ్రామం చిట్కుల్ లో రెండు ఎంపీటీసీలను గెలిపించానని అందులో మా అమ్మ రాధమ్మ ఉన్నారని స్పష్టం చేశారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తన వంతుగా కృషి చేశానన్నారు. గత నాలుగైదు ఏండ్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా పార్టీ అభ్యున్నతి కోసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను విరివిగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లానని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం తన ఆస్తులను సైతం అమ్మి కార్యక్రమాలు నిర్వహించానన్నారు. అయినా బీఆర్ఎస్ పార్టీ కనీసం తన సేవలను గుర్తించకపోవడం, పార్టీ అభ్యర్థిగా ప్రకటించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు