Monday, May 6, 2024

లిమిట్స్ క్రాస్ చేస్తున్న డ్రాగన్ కంట్రీ..

తప్పక చదవండి
  • చైనా మరోమారు దుందుడుకు చర్య..
  • భారత్‌ భూభాగాలతో దేశ పటం విడుదల..
  • కేంద్రం మౌనంపై మండిపడ్డ రాహుల్‌, సంజయ్‌ రౌత్‌..

న్యూ ఢిల్లీ : చైనా మరోమారు తన దుందుడుకుతనాన్ని ప్రదర్శించింది. భారత్‌లోని భాగాలను తమ పటంలో చూపి తెంపరితనం ప్రదర్శించింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌, ఆక్సాయ్‌చిన్‌లను తమ భూభాగాలు చూపుతూ డ్రాగన్‌ దేశం చైనా అధికారిక మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో అరుణాచల్‌ ప్రదేశ్‌ దక్షిణ టిబెట్‌లో భాగమని పేర్కొంది. ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతాన్ని సైతం చైనా తన మ్యాప్‌లో చేర్చింది. ఆక్సాయ్‌ చిన్‌ను చైనా 1962లో ఆక్రమించింది. వీటితో పాటు తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం కూడా ఈ మ్యాప్‌లో చైనా సరిహద్దులో భాగంగా చూపించింది. ఈ మ్యాప్‌ను ఆ దేశ సహజ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సర్వేయింగ్‌ అండ్‌ మ్యాపింగ్‌ పబ్లిసిటీ డే, నేషనల్‌ మ్యాపింగ్‌ అవేర్‌నెస్‌ పబ్లిసిటీ వీక్‌ సందర్భంగా ఈ మ్యాప్‌ విడుదల చేసింది డ్రాగన్‌ దేశం. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గతంలో భారత్‌లోని ఒక్క అంగుళం భూమిని సైతం చైనా ఆక్రమించలేదన్న కేంద్రం వాదన ఏమాత్రం సరికాదన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని రాహుల్‌ పేర్కొన్నారు. చైనా మన భూమిని ఆక్రమిస్తుంటే స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారని, చైనా సైనికులు తమ పచ్చిక బయళ్లను లాక్కున్నారని, అయితే.. అంగుళం భూమిని సైతం తీసుకోలేదని ప్రధాని చెబుతున్నారని, ఇది నిజం కాదంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై శివసనే (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ కేంద్రంపై మండిపడ్డారు. లడఖ్‌పై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని, కేంద్ర ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్‌ స్టయ్రిక్స్‌ చేసి చూపాలని సంజయ్‌ రౌత్‌ సవాల్‌ విసిరారు. లడఖ్‌లోని పాంగాంగ్‌ వ్యాలీలోకి చైనా ప్రవేశించిందని, అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు చైనా ప్రయత్నిస్తుందన్న రాహుల్‌ వ్యాఖ్యలు సరైనవేనన్నారు. ఇటీవల బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ అక్కడ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిశారని, ఆ తర్వాత ఆ దేశం మ్యాప్‌ను విడుదల చేసిందని ఆరోపించారు. ఈ నెల 28న చైనా కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు