Wednesday, May 15, 2024

కాలుష్య కోరల్లో దేశ రాజధాని ఢిల్లీ

తప్పక చదవండి

ఢిల్లీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రతి ఏట అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో మానవ నిర్మిత, వాతావరణ సంక్షోభాల విష వలయంలో చిక్కుక్కుంటోంది. ప్రజలు ఊపిరి తీయడం ప్రాణాంతకం అవుతున్నది. గాలి నాణ్యత ప్రమాణాలు హద్దులు దాటి మహానగరవాసుల ఉసురా తీస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు దొరక్క ఢిల్లీవాసులు ప్రమాదకర పరిస్థితులతో చేసేదిలే సంసారాలు ఈడుస్తున్నారు. గత వారమే ఢిల్లీ ప్రజలు కాలుష్య విషనాగు బుసలను ప్రత్యక్షంగా చూశారు. తాజాగా ఢిల్లీలో దుమ్ము, ధూళి, పొగలు కలిసి గాలి కాలుష్య ప్రమాణాలైన ఏయిర్‌ క్వాలిటీ ఇండెక్స్, ఏక్యూఐ (గాలి నాణ్యత సూచీ) 300 దాటుతూ అత్యంత ప్రమాదకర 500 స్థాయి వరకు చేరడం గమనించారు. ఇది అంతం కాదు ఆరంభమే అని మహానగర పౌరులకు తెలుసు. అదృష్టం కొద్ది గాలులు వేగంగా వీచడంతో ఆ ప్రమాదకర పొగమంచు నగరాన్ని వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఢిల్లీ మహానగర జనాభా 2 కోట్లు, పరిసర ప్రాంతాల ప్రజలు మరో కోటి వరకు కాలుష్య కోరల్లో చిక్కి కుతకుత ఉడుకుతున్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిష్కారాలను చూపని యెడల దేశ రాజధాని ప్రజలు తమ ఆరోగ్యాలను తాకట్టు పెట్టి జీవనయానం చేయవలసిందే. వీరితో పాటు పాఠశాల, కళాశాలల విద్యార్థులు కూడా గాలి కాలుష్య కోరల్లో చిక్కాల్సిందే అని గమనించాలి.

ఢిల్లీ గాలి కాలుష్యానికి పలు ప్రధాన కారణాలు:

- Advertisement -

కర్ణుడి చావుకు కారణాలనేకం. ఢిల్లీ గాలి కాలుష్యానికి కూడా కారణాలు బోలెడు. మానవ ప్రమేయ పారిశ్రామిక కాలుష్యం, శిలాజ ఇంధన వాహన కాలుష్యం, వ్యర్థాలను మండించడం, రోడ్ల దుస్థితులతో దుమ్ము రేగడం, పర్వదినాల్లో టపాసుల్ని కాల్చడం లాంటివి గాలి కాలుష్యాగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో హరిత విప్లవ మూలంగా రైతులు తమ వ్యవసాయ పంట వ్యర్థాలను విచక్షణారహితంగా కాల్చేయడం కూడా గాలి కాలుష్యం పెరగడానికి కారణం అవుతున్నది. రైతులకు మరో మార్గం దొరక్క, సమయం తక్కువగా ఉండడం, సులభంగా వ్యర్థాలను తొలగించడం, ఆర్థికంగా బలహీనంగా ఉండడం, అవగాహన లోపించడం, ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలను చూపకపోవడంతో పంట వ్యర్థాలను అగ్నికి ఆహుతి చేస్తున్నట్లు అర్థం అవుతున్నది. వరి పంట లాంటి అధిక సాగునీరు అవసరమైన పంటల్ని అధిక మొత్తంలో పండించడం కూడా పలు విధాలుగా పర్యావరణ విచ్ఛిన్నానికి దారి తీస్తున్నాయి. శీతాకాలం ప్రవేశించడంతో గాలు బరువెక్కడం, మంచు కురవడం, పొగ కమ్మడంతో ప్రమాదకర కాంతి రసాయన పొగమంచు(స్మోగ్‌)గా మారడంతో ఆ కలుషిత గాలిని పీల్చడంతో అనారోగ్యాలు, భూఉపరితలంపై దట్టమైన మబ్బులు కమ్మడంతో కళ్లు మండడం, వాహనాలు కనిపించక ప్రమాదాలు జరగడం లాంటి విపరీత పరిస్థితులు నగరవాసులకు ఎదురవుతున్నాయి. ఢిల్లీ మహానగరం థార్‌ ఎడారికి సమీపాన ఉండడంతో దుమ్ము ధూళి రేగడం వాతావరణ సమస్య గంభీరతను మరింత జటిలం చేస్తున్నది.
ఈ విపరీత పరిస్థితులను అంచనా వేస్తూ ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలను నిరంతరం తీసుకోవలసిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్య కారణ ప్రరిశ్రమలను కట్టడి చేయడం, వాహనాల ఇంజన్‌ కండీషన్లను పర్యవేక్షించడం, వాహన రద్దీని శాస్త్రీయంగా నియంత్రించడం, వ్యవసాయ వ్యర్థాల తొలగింపుకు తగిన పరిష్కారాలు చూపడం, దుమ్ము ధూళిని పీల్చగల ఫిల్టర్లను ఏర్పాటు చేయడం లాంటి అనేక చర్య తక్షణావసరాలని పాలకులు, పౌర సమాజం మేల్కొనాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు